
జనగామ, వెలుగు: జనగామ నియోజక వర్గంపై రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్నేసినట్లు బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా జనగామ నుంచి పోటీకి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపుతుండగా, ఇప్పుడు పల్లా పేరు తెరపైకి వచ్చింది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఓ ఆడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్, పల్లా ప్రధాన అనుచరుడు పాగాల సంపత్ రెడ్డి నర్మెట జడ్పీటీసీ మాలోతు శ్రీనివాస్ తో చేసిన సంభాషణ హాట్ టాపిక్ గా మారింది.
కావాలనే ఆడియో లీక్?
పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, నర్మెట జడ్పీటీసీ తో మాట్లాడిన ఫోన్టాక్ ను కావాలనే లీక్ చేసినట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముత్తిరెడ్డిపై హైకమాండ్ వ్యతిరేకంగా ఉందని, ఆయన స్థానంలో ప్రస్తుతం పోచంపల్లి పేరు నానుతోందని, ఈ ప్లేస్లో పల్లాను తెరపైకి తెచ్చేం దుకే ఆడియోను వైరల్ చేసినట్లు భావిస్తున్నారు. రెండు మూడు నెలలుగా పోచంపల్లి పేరే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తనదైన శైలిలో పోచంపల్లిని కంట్రోల్ చేస్తున్నారు. కానీ, తాజాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరపైకి రావడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. పల్లా కూడా నియోజక వర్గంలోని ముఖ్య లీడర్లకు ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. బరిలో ఉంటే గెలుపు అవకాశాలపై ఆరా తీసినట్లు వినికిడి. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ దగ్గరకు తన అనుచరులను పంపి టికెట్ ఖరారు చేసుకునేందుకు రెడీ అయినట్లు భావిస్తున్నారు. ప్రధాన అనుచరుడైన పాగాల సంపత్ రెడ్డి ద్వారా సెకండ్ క్యాడర్ లీడర్లను ఏకం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘పోచంపల్లికి టికెట్ వస్తే అభ్యంతరం లేదు.
కానీ, ఆయన నాన్ లోకల్ అంటే మన సార్ రాజేశ్వర్ రెడ్డికి ఇయ్యమని అందాం.. మన నాలుగు మండలాల్లోని నలుగురం జడ్పీటీసీలం, ఎంపీపీలం కలిసి పోయి కేసీఆర్ సారుకు రిప్రజెంటేషన్ ఇద్దాం.. ఆయన దగ్గరకు తీసుకుపోయే బాధ్యత నాది’ అంటూ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియోలో ఉంది. తాజా పరిణామాలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరింత తలనొప్పిగా మారాయి. ఓవైపు తన తండ్రి భూములు కబ్జా చేస్తాడని ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి ఆరోపిస్తే..మిత్రులు అనుకున్న పోచంపల్లి, పల్లాలు ఏకంగా తన సీటుకే ఎసరు పెడుతున్నారన్న ప్రచారం ఆయనకు మింగుడు పడట్లేదు. కాగా, వచ్చే ఎలక్షన్లో ఎవరు బరిలో ఉంటారనేది సస్పెన్స్గా మారడంతో క్యాడర్ డైలామాలో పడింది.