![నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ..](https://static.v6velugu.com/uploads/2025/02/panchayat-election-arrangements-begin-full-details_C5jzQdVeyF.jpg)
- 15 వ తేదీలోపు ఆఫీసర్లకు ఎలక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసేలా ప్లాన్
- నిజామాబాద్ లో 545, కామారెడ్డిలో 536 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు
నిజామాబాద్, కామారెడ్డి వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది. దీని కోసం కలెక్టర్లు ఆయా శాఖల అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పోలింగ్ కు సంబంధించిన హ్యాండ్ బుక్స్, ఇతర మెటీరీయల్ ఎంపీడీవో ఆఫీసులకు చేర్చారు. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన 15 పంచాయతీలతో కలిపి మొత్తం 545 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లకు, 5022 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్లో మొత్తం ఓటర్లు 8,30,580
2025 జనవరి 1 నాటికి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు 4,43,548, పురుషులు 3,87,017 ఇతరులు 15 మంది కలిపి మొత్తం 8,30,580 ఓటర్లు ఉన్నారు. 5,053 పోలింగ్సెంటర్లను రెడీ చేశారు. 6,064 మందిని ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 8,160 మంది ఉద్యోగులను ఏపీవోలుగా నియమించారు.
కామారెడ్డిలో రెండు విడతల్లో ఎన్నికలు
కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించనున్నారు. 3 రెవెన్యూ డివిజన్లు, 25 మండలాల్లో 536 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6,53,130 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 13 మండలాలు, రెండో విడతలో 12 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆర్వోలకు ట్రైనింగ్ ఇచ్చారు. పోలింగ్అధికారులకు ఈనెల 15న మండల స్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు.
మొత్తం పోలింగ్ కేంద్రాలు 4.715 ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం 175 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 5 వేల జనాభాకు ఒక నామినేషన్ స్వీకరణ కేంద్రం ఉంటుంది. 5 వేల జనాభా ఉన్న ఒక పంచాయతీకి ఒకటి ఏర్పాటు కానుండగా, చిన్న పంచాయతీలను 3, 4 కలిపి ఒక నామినేషన్ స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తారు.
- మొదటి విడతలో కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, పాల్వంచ, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డి పేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
- రెండో విడతలో బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, నిజాంసాగర్, మహమ్మద్నగర్, జుక్కల్, మద్నూర్, డొంగ్లి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.