
- పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరం
- డీపీఆర్ మాటున చేసిన పనులన్నింటినీ ఆపి.. ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తేవాలి
- తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూడ్చేయాలి.. తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి
- రీస్టోరేషన్ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్ను సమర్పించాలి
- అఫిడవిట్లోని అంశాలకు.. సైట్ ఇన్స్పెక్షన్కు
- పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
- మంత్రి ఉత్తమ్, సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖలకు స్పందన
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(ఆర్ఎల్ఐఎస్) ప్రాజెక్ట్పై ఏపీకి చుక్కెదురైంది. పర్యావరణ అనుమతుల (ఈసీ– ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్)పై ఎక్స్పర్ట్స్ అప్రైజల్కమిటీ(ఈఏసీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమంగా చేపట్టిన ఆ ప్రాజెక్టుకు ఇప్పుడప్పుడే ఈసీ అనుమతులు ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పోరాటం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖల ఫలితంగా.. ఏపీకి ఈఏసీ వార్నింగ్ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 10న ఢిల్లీలో జరిగిన ఈఏసీ మీటింగ్లో.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను మార్చాలని ఈఏసీ నిర్ణయించింది. ఆ మీటింగ్కు సంబంధించిన మినిట్స్ను ఫిబ్రవరి 27న ఈఏసీ విడుదల చేసింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఈఏసీ మెంబర్ సెక్రటరీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే దీనిపై రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయని కమిటీకి వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఏసీ.. ఈసీ కావాలంటే ముందు ప్రాజెక్టు సైట్ను పూర్వ స్థితికి తీసుకురావాలని తేల్చి చెప్పింది.
తప్పుడు వివరాలిస్తే చర్యలు తప్పవ్..
ప్రాజెక్టుకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం చేపట్టిన పనులు.. డీపీఆర్కు అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే చర్యలు తప్పవని ఈఏసీ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈసీ అప్లికేషన్ సమయంలో అఫిడవిట్ రూపంలో ఏపీ అండర్ టేకింగ్ను సమర్పించాలని తేల్చి చెప్పింది. డీపీఆర్ అవసరాలకు మించి పనులు జరగలేదంటూ ఉన్నత స్థాయి అధికారి సంతకంతో అఫిడవిట్ను ఇవ్వాలని, దానికి పూర్వస్థితికి తీసుకొచ్చిన పనులకు సంబంధించిన ఫొటోలు, తీసుకున్న చర్యలు, రీస్టోరేషన్ కోసం ఎంచుకున్న పద్ధతులు, ఆ పనులు ఎప్పుడు పూర్తి చేశారు వంటి పూర్తి వివరాలను అఫిడవిట్కు జత చేయాలని స్పష్టం చేసింది. అఫిడవిట్లో ఉన్న దానికి భిన్నంగా ప్రాజెక్ట్ సైట్లో పనులు జరిగినట్టు తేలినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వాటర్(కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1974, ఎయిర్ (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981, పర్యావరణ (పరిరక్షణ) చట్టం 1986 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈఏసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశాలన్నింటి ఆధారంగా జనవరి 10న నిర్వహించిన మీటింగ్లో నిర్ణయించినట్టుగా ప్రాజెక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను పూర్తిగా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
తాత్కాలికమైనవి తొలగించాల్సిందే..
ఈసీకి అప్లై చేసుకోవడానికి ముందు ఏపీ.. ప్రాజెక్ట్ సైట్లో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని ఈఏసీ స్పష్టం చేసింది. డీపీఆర్ ప్రిపరేషన్ కోసమే చేశారని చెబుతున్న పనుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలని తేల్చి చెప్పింది. తవ్విన ప్రాంతాలను పూడ్చేయాలని, డీపీఆర్ కోసం ఆ ప్రాంతంలో ఇంకా ఏమేం పనులు చేశారో వాటన్నింటినీ పూర్వస్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈసీ కోసం అప్లికేషన్ పెట్టుకునే సమయంలో అన్ని నిబంధనలను పాటించాలని తేల్చి చెప్పింది.
‘‘ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 నిబంధనలకు లోబడి డీపీఆర్ కోసం సైట్లో పనులు చేసినట్టుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకురావాలి. ఆ సైట్లో కేంద్ర పర్యావరణ శాఖ, సీడబ్ల్యూసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత.. అందుకు అనుగుణంగానే ఎన్వోసీని తీసుకోవాలి. కేంద్ర పర్యావరణ శాఖ రీజనల్ ఆఫీసర్ దానికి నోడల్ ఆఫీసర్గా ఉండాలి. ప్రాజెక్ట్ చేపడుతున్న ప్రాంతంలో పర్యావరణ నష్టం జరగలేదని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ నిర్ధారించాలి. ఒకవేళ ఏదైనా నష్టం జరిగినట్టు తేలితే.. అందుకు అనుగుణంగా దానిపై వివరాలను రిపోర్టు రూపంలో సమర్పించాలి. లీగల్, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నివేదికను తయారు చేయాలి. సైట్ రీస్టోరేషన్ కోసం ఏపీ తీసుకున్న చర్యలు, ఫొటో ఎవిడెన్సులు, రీస్టోరేషన్ పద్ధతులపై సమగ్రమైన రిపోర్టును కేంద్రానికి (పర్యావరణ మంత్రిత్వ శాఖకు) సమర్పించాలి. దాంతోపాటు ఈఏసీ సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను పర్యావరణ శాఖ సమీక్షించి సైట్ ఇన్స్పెక్షన్కు అనుగుణంగా సర్టిఫికెట్ను తీసుకోవాలి. దానికి మరికొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. టెక్నాలజీ సాయాన్ని తీసుకునేలా సక్టోరల్ ఈఏసీతో సంప్రదింపులు జరిపి ముందుకెళ్లాలి’’ అని ఈఏసీ స్పష్టం చేసింది.
నిబంధనలను ఏపీ ఉల్లంఘించింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఏపీ నిర్మించతలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులను నిరాకరించడం కాంగ్రెస్ సర్కార్ విజయమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపట్టిందని పలుమార్లు కేంద్రానికి తాను ఫిర్యాదు చేశానని, దాంతో పాటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పర్యావరణ చట్టాలనూ ఏపీ ఉల్లంఘించిందన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ సర్కారు.. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించిందన్నారు. ఎన్జీటీ, పర్యావరణ శాఖ, కృష్ణా బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపించడంతోనే ఏపీ విషయంలో ఈఏసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులను సమీక్షించిన ఈఏసీ.. ఏపీ నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టును చేపట్టిందన్న నిర్ణయానికి వచ్చిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోకుంటే రాష్ట్రంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడేవని పేర్కొన్నారు.