
బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసుల కొరడా ఝులిపిస్తున్నారు. 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 318(4), 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేస్తూ కటకటాల్లోకి నెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పల పాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో యాప్స్ను ప్రమోట్ చేయించుకుంటూ.. సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నది. వీటిని ప్రమోట్ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.