
ముంబై: ఓ పక్క విపరీతంగా ట్రాఫిక్, మరోవైపు ఎగ్జామ్కు టైం అవుతుండటంతో డిగ్రీ స్టూడెంట్ ఏకంగా పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్ అయింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగాడే బీకాం ఫస్టియర్ చదువుతూనే పంచగని ఏరియాలో పార్ట్ టైంగా చెరుకు రసం అమ్ముతున్నాడు.
జ్యూస్ అమ్మేందుకు ఎప్పటిలాగే పంచగనికి వెళ్లిన సమర్థ్.. అదేరోజు ఎగ్జామ్కు హాజరుకావాల్సి ఉంది. అప్పటికే ఆలస్యమై పరీక్షకు ఇంకో 20 నిమిషాలే మిగిలి ఉంది. బస్లోనో, బైక్మీదో వెళ్తే ట్రాఫిక్ లోనే ఎగ్జామ్ టైంకాస్తా ముగిసిపోయేలా ఉందనుకున్న సమర్థ్.. వెరైటీగా ప్లాన్ చేశాడు. పంచగని పారాగ్లైడింగ్కు మంచి స్పాట్ కావడంతో జీపీ అడ్వెంచర్ అనే ప్రైవేట్ పారాగ్లైడింగ్ సెంటర్కు వెళ్లి తన పరిస్థితిని వివరించాడు.
ఇంకేముంది.. గైడ్ సాయంతో వెంటనే పారాగ్లైండింగ్ చేసి ఇన్ టైంలోనే సెంటర్లో ల్యాండ్ అయ్యాడు. కొద్దిరోజులకింద జరిగిన ఈ అడ్వెంచరెస్ ఫీట్ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.