
- ఓపెన్ స్విమ్మింగ్ పోటీలకు నదిలో
- నీళ్లు బాగున్నాయని చెప్పే ప్రయత్నం
పారిస్ : ఒలింపిక్స్ నేపథ్యంలో పారిస్ మేయర్ అన్నె హిడాల్గో ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఓపెన్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ నిర్వహించే సీన్ నది నీళ్లు మురికిగా ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆమె గేమ్స్ వరకు నది నీళ్లను పూర్తి స్థాయిలో శుభ్రం చేయిస్తానని అప్పట్లో వాగ్దానం చేసింది. అనుకున్న ప్రకారమే నదిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయించింది. అందులో భాగంగా బుధవారం హిడాల్గో నదిలో స్విమ్మింగ్ కూడా చేసింది. సిటీ హాల్కు సమీపంలోని నోట్రే డామ్ కేథడ్రాల్ నుంచి నదిలోకి దూకింది.
పారిస్ గేమ్స్ చీఫ్ టోనీ ఎస్టాంగ్యూట్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఆమెను అనుసరించారు. ‘నీరు చాలా బాగుంది. కొంచెం చల్లగా ఉన్నాయి. అయినా ఓకే. ఓపెనింగ్ స్విమ్మింగ్ పోటీలకు సీన్ నది అనుకూలంగా ఉంది’ అని హిడాల్గో ప్రకటించింది. కొన్ని నెలల కిందట ఒలింపిక్స్ అధికారులు సీన్ నది నాణ్యతను పరీక్షించారు. ఇందులో ‘ఇ.కొలీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని నివేదికలు వచ్చాయి.
దీంతో తక్షణమే రంగంలోకి దిగిన మేయర్ నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సీన్ నదిలో మారథాన్, ట్రయథ్లాన్ స్విమ్మింగ్తో పాటు మరికొన్ని క్రీడలు జరగనున్నాయి.