
పారిస్: ఈ ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీల్లో వివాదాస్పదంగా మారిన అల్జీరియా బాక్స ర్ ఇమానె ఖెలిఫ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. అమ్మాయి కాదు అబ్బాయి అంటూ ఆరోపణలు, వివక్ష ఎదుర్కొన్నప్పటికీ ప్రతీ రౌండ్లో తన పంచ్ పవర్ చూపెట్టిన ఇమానె విమెన్స్ 66 కేజీ ఫైనల్లో 5–0తో చైనాకు చెందిన యాంగ్ లియును చిత్తు చేసి ఒలింపిక్ చాంపియన్గా నిలిచింది.
ఈ బౌట్లో ఖెలిఫ్కు స్టేడియంలో అభిమానుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అల్గేరియా జెండాలు పట్టుకున్న పలువురు.. ఖెలిఫ్ చైనా ప్రత్యర్థిపై పంచ్ విసిరినప్పుడల్లా ఆమె పేరు చెబుతూ కేరింతలు కొట్టారు. బౌట్ గెలవగానే అభిమానుల నుంచి తమ దేశ జెండా తీసుకొని తిరిగిన ఖెలిఫ్ ఎనిమిదేండ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూశానని, తానిప్పుడు ఒలింపిక్ చాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ అని గర్వంగా చెప్పింది. విమర్శల దాడి తర్వాత ఈ విజయం మరింత ప్రత్యేకంగా ఉందని తెలిపింది.