
- కాంస్యంతోనూ సంతోషంగా ఉన్నామన్న మన్ప్రీత్
- హాకీ వీరులకు ఢిల్లీలో ఘన స్వాగతం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలవకపోవడం కాస్త నిరాశ కలిగించిందని ఇండియా హాకీ స్టార్ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్ అన్నాడు. ఫైనల్స్ ఆడటమే లక్ష్యంగా బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదన్నాడు. అయితే వరుసగా రెండు గేమ్స్ల్లోనూ కాంస్యాలు నెగ్గడం చాలా గొప్పగా ఉందని వ్యాఖ్యానించాడు ‘టోక్యో ఒలింపిక్స్లో మేం బ్రాంజ్ గెలిచాం. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించాం. అద్భుతంగా అనిపిస్తున్నది. వాస్తవానికి ఫైనల్ ఆడాలన్నది మా లక్ష్యం. గోల్డ్ గెలిస్తే బాగుండేది. కానీ అది మా చేతుల్లో నుంచి జారిపోయింది. సెమీస్లో 10 మందితోనే ఆడటం మాలో మానసిక ధైర్యాన్ని పెంచింది. ఇలాంటి అంశాలను ముందే ఊహించి అందుకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటాం. గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డ్లు వస్తే ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు వేసుకుంటా. అప్పుడు జరిగిన సంఘటనలో రోహిడాస్ తప్పేమీ లేదు. దురదృష్టవశాత్తు రెడ్ కార్డు ఇచ్చారు’ అని మన్ప్రీత్ పేర్కొన్నాడు. మన్ప్రీత్ సారథ్యంలోనే ఇండియా టీమ్ టోక్యోలో బ్రాంజ్ మెడల్ గెలిచింది.
శ్రీజేష్ గొప్ప వ్యక్తి..
18 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పిన గోల్ కీపర్ శ్రీజేష్పై మన్ప్రీత్తో పాటు ఇతర సహచరులు ప్రశంసలు కురిపించారు. ఇక నుంచి అతను మైదానంలో లేకపోవడం లోటుగా ఉంటుందన్నాడు. ‘శ్రీజేష్ గురించి నేను ఏమి చెప్పలేను. అతనితో కలిసి 13 ఏళ్లుగా ఆడుతున్నా. అతను నాకు సీనియర్. చాలాసార్లు మార్గనిర్దేశం చేశాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదో సవిరంగా చెబుతాడు. ఓ ప్లేయర్గా నన్నెప్పుడూ ప్రేరేపిస్తుంటాడు. చాలా గొప్ప వ్యక్తి. హాకీలో ఓ లెజెండ్ ప్లేయర్. తోటి ప్లేయర్లతో సోదరుడిగా మెలిగేవాడు. ఇప్పుడు అతని సేవలను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని మన్ప్రీత్ వ్యాఖ్యానించాడు.
డోలు వాయిద్యాలు.. సాంప్రదాయ నృత్యాలు
మెగా గేమ్స్లో కాంస్య పతకం గెలిచి ఇండియాకు చేరుకున్న హాకీ టీమ్కు శనివారం ఘన స్వాగతం లభించింది. వేలాది మంది ఫ్యాన్స్ బారులు తీరి తమ అభిమాన ప్లేయర్లను పూల దండలతో ముంచెత్తారు. డోల్ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ముగింపు కార్యక్రమం కోసం శ్రీజేష్, రోహిదాస్, రాజ్కుమార్, అభిషేక్, సుఖ్జీత్, సంజయ్ పారిస్నే ఉండిపోయారు.