
- గతంలో 8 బంగారు పతకాలు గెలిచిన హాకీ వీరులు
- టోక్యోలో బ్రాంజ్ మెడల్ సొంతం
- మరో 3 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్
ఒలింపిక్స్లో ఓ ఆట నుంచి ఒక్క గోల్డ్ వస్తేనే ప్రపంచాన్నే గెలిచినంత సంబురపడతాం. ఈ విశ్వ క్రీడల్లో ఏకంగా ఎనిమిది బంగారు పతకాలు గెలిచిన ఘన చరిత్ర మన హాకీ జట్టుది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈ ఆటలో ఇండియా ఏకఛత్రాధిపత్యం చూపెట్టింది. కానీ, సమయం గడుస్తున్న కొద్దీ ఆటలో, పతకాల వేటలో పతనమైంది. దాదాపు 41 ఏండ్ల పాటు మరో పతకం అందుకోలేకపోయింది. కానీ, సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మూడేండ్ల కిందట టోక్యోలో బ్రాంజ్ మెడల్ నెగ్గడంతో మన హాకీకి కొత్త ఊపిరి లభించింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలో మన హాకీ వీరులు పారిస్ సవాల్కు సిద్ధమయ్యారు. ఈసారి గోల్డ్ నెగ్గి గత వైభవాన్ని తిరిగి తెస్తారా?
ఒలింపిక్స్లో ఇండియా హాకీ జట్టుది ఘన చరిత్ర. ఎనిమిది గోల్డ్ సహా 12 మెడల్స్తో మెగా గేమ్స్లో అత్యధిక విజయవంతమైన జట్టుగా నిలిచింది. 1928లో ఆమ్స్టర్డామ్లో మొదలైన స్వర్ణయాత్రను 1980 వరకు కొనసాగించింది. మధ్యలో ఓ సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ కూడా లభించాయి. కానీ, కాల క్రమేనా మన హాకీ వీరుల ఆట అనూహ్యంగా దిగజారింది. 1984 ఒలింపిక్స్ నుంచి 2016 రియో గేమ్స్ వరకూ ప్రతీసారి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చిన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో మాత్రం అద్భుతం చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాంజ్ అందుకుంది.
సెమీఫైనల్లో ఓడినా మూడో ప్లేస్ మ్యాచ్లో బలమైన జర్మనీని ఓడించి ఔరా అనిపించింది. దాంతో పారిస్ మెగా గేమ్స్లోనూ ఇండియా పతకం ఆశిస్తున్న ఆటల్లో హాకీ కూడా ఉంది. టోక్యోలో ఇండియా పతకం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన వెటరన్ గోల్ కీపర్ ఈ ఒలింపిక్స్తో రిటైర్ అవుతున్నాడు. మరి, మన హాకీ వీరులు మరో మెడల్ నెగ్గి అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతారేమో చూడాలి.
అంత ఈజీ కాదు
గతేడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఏషియన్ గేమ్స్లో ఇండియా గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంది. రెండు ఈవెంట్లలోనూ అజేయంగా నిలవడంతో పారిస్లోనూ ఇండియా హాకీ టీమ్పై అంచనాలు పెరిగాయి. కానీ, 12 మేటి జట్లు బరిలో నిలిచిన హాకీ ఈవెంట్లో ఇండియాకు కఠిన సవాల్ ఎదురవనుంది. మెగా ఈవెంట్లో మన టీమ్ డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, మాజీ విన్నర్స్ ఆస్ట్రేలియా, అర్జెంటీనాతో పాటు న్యూజిలాండ్, ఐర్లాండ్తో కూడిన కఠినమైనపూల్-–బిలో బరిలో నిలిచింది. పూల్–ఎలో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఆతిథ్య ఫ్రాన్స్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇండియా తొలి టార్గెట్ గ్రూప్ లో టాప్4 ప్లేస్తో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంపైనే ఉండనుంది. ఆ తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుంది. ఇక, ఒలింపిక్స్కు ముందు ఇండియా అంతగా ఫామ్లో లేకపోవడం మైనస్ పాయింట్. ఆస్ట్రేలియాతో సిరీస్తో పాటు ఆంట్వెర్ప్, లండన్లో జరిగిన ఎనిమిది హాకీ ప్రో లీగ్ మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయింది. చాలా మ్యాచ్ల్లో ఓడిన జట్టు.. తొమ్మిది దేశాలతో కూడిన ప్రో లీగ్లో ఏడో స్థానంతో సరిపెట్టింది. ఫలితంగా ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో టాప్5 నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.
అనుభవమే బలం
ఈ మెగా గేమ్స్ కోసం సెలెక్షన్ కమిటీ అనుభవం ఉన్న ఆటగాళ్లకే ఓటు వేసింది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న 11 మందిని జట్టులోకి తీసుకుంది. లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్తో పాటు టోక్యోలో కెప్టెన్గా వ్యవహరించిన మన్ప్రీత్ సింగ్ నాలుగోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. కొత్తగా ఐదుగురు ఆటగాళ్లు జర్మన్ప్రీత్, సంజయ్, రాజ్ కుమార్, అభిషేక్, సుఖ్జీత్ ఒలింపిక్స్ అరంగేట్రం చేయనున్నారు. ఎక్కువ మంది సీనియర్లు ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. పారిస్లో ఎదురయ్యే కఠిన సవాళ్లను అధిగమించడంలో వీళ్లు జట్టుకు సాయం చేయనున్నారు. కానీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో మన హాకీ టీమ్ సంధికాలాన్ని దాటింది. పుల్లన్ మనోళ్ల అప్రోచ్ను ఎటాకింగ్ నుంచి డిఫెన్స్కు మార్చాడు. ఆసియా–స్టయిల్ హాకీలో దూకుడుగా ఆడే విధానంపైనే ఇప్పటిదాకా ఇండియా నమ్మకం ఉంచింది. కానీ, ఫుల్టన్ తెచ్చిన మార్పు ఒలింపిక్స్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ మెగా ఈవెంట్లో ఇండియా ఈనెల 27న న్యూజిలాండ్తో తమ పతక వేటను ఆరంభించనుంది. ఈ మ్యాచ్తో పాటు ఐర్లాండ్ (జులై 30)తో పోరు జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలో గెలిస్తే ఇండియా గ్రూప్లో నాలుగో ప్లేస్తో క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. జులై 29న అర్జెంటీనా, ఆగస్టు 1న బెల్జియం, 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఇండియా ఒలింపిక్ టీమ్ :
గోల్ కీపర్లు: పీఆర్ శ్రీజేష్; డిఫెండర్లు: జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), సుమిత్, సంజయ్; మిడ్ఫీల్డర్లు: రాజ్కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్; ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్.
పారిస్తో ముగిస్తా : శ్రీజేష్
న్యూఢిల్లీ: ఇండియా హాకీ లెజెండ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పారిస్ ఒలింపిక్స్తో తన ఆట ముగించనున్నాడు. ఈ నెల 26 నుంచి జరిగే మెగా గేమ్స్ ముగిసిన తర్వాత హాకీకి గుడ్బై చెబుతానని శ్రీజేష్ సోమవారం ప్రకటించాడు. 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్తో పాటు ఇండియా టీమ్ సాధించిన ఎన్నో చారిత్రక విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. 36 ఏండ్ల శ్రీజేష్ ఇప్పటిదాకా 328 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. మూడుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న అతను అనేక సార్లు కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్స్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు. పారిస్ గేమ్స్ అతనికి నాలుగో ఒలింపిక్స్. ‘పారిస్లో చివరిసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నేను ఎంతో గర్వం, ఆశతో ముందుకెళ్తున్నా. ఇన్నేండ్ల ప్రయాణంలో నా ఫ్యామిలీ, తోటి ఆటగాళ్లు, కోచ్లు, ప్యాన్స్, హాకీ ఇండియా నుంచి లభించిన ప్రేమ, మద్దతుకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. నా తోటి ఆటగాళ్లు అన్ని సమయాల్లో నా పక్కనే ఉన్నారు. పారిస్లో మా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. టోక్యోలో నెగ్గిన మెడల్ కలర్ను మార్చాలని కోరుకుంటున్నాం’ అని శ్రీజేష్ చెప్పుకొచ్చాడు.