
- పారిస్ ఒలింపిక్స్కు ఇండియా అథ్లెట్ల లిస్ట్ విడుదల చేసిన ఐఓఏ
- 140 మంది సపోర్ట్ స్టాఫ్, అధికారులకు అవకాశం
న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్లో ఇండియా నుంచి ఈసారి 117 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఇచ్చిన ఒలింపిక్స్ పోటీదారుల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తుది అనుమతి ఇచ్చింది. అథ్లెట్లకు తోడు 140 మంది సపోర్ట్ స్టాఫ్, అధికారులకు అనుమతి మంజూరు చేసింది. ఇందులో 72 మందికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. క్రీడా శాఖ విడుదల చేసిన జాబితాలో ఒలింపిక్స్కు అర్హత సాధించిన షాట్ పుట్టర్ అభా ఖతువా పేరు లేకపోవడం గమనార్హం.
వరల్డ్ ర్యాంకింగ్ కోటా ద్వారా ఖతువా పారిస్ గేమ్స్కు ఎంపికైంది. కానీ, కొన్ని రోజుల కింద వరల్డ్ అథ్లెట్లిక్స్ ప్రకటించిన ఒలింపిక్ పోటీదారుల జాబితాలో ఖతువా పేరు లేకపోవడంతో క్రీడా శాఖ కూడా ఆమె పేరు తొలగించింది. కానీ, ఇందుకు కారణాన్ని వెల్లడించలేదు. ఖతువా లేకపోయినా ఈ ఒలింపిక్స్లో పోటీ పడే వారిలో 29 మందితో అథ్లెటిక్స్ క్రీడాకారులే ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత షూటింగ్ నుంచి 21 మంది, హాకీ నుంచి 19 మంది బరిలో నిలిచారు.
టేబుల్ టెన్నిస్లో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్లో పీవీ సింధు సహా ఏడుగురు ఉన్నారు. రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6) నుంచి కూడా చెప్పుకోదగ్గ పోటీదారులు ఉండగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్లిఫ్టింగ్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే పోటీ పడనున్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఇండియా నుంచి అత్యధికంగా 119 మంది పోటీ పడగా.. అత్యుత్తమంగా ఏడు మెడల్స్ లభించాయి.