
పారిస్: ఆటపై ఇష్టంతో తాలిబాన్ల రాజ్యం అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి.. స్పెయిన్లో తలదాచుకొని శరణార్థి జట్టు అథ్లెట్గా ఒలింపిక్స్ బరిలో నిలిచిన అఫ్గాన్ బ్రేకర్ మనిఝా తలాష్ పారిస్ గేమ్స్ నుంచి అనర్హతకు గురైంది. శుక్రవారం ఇండియా సర్జోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బ్యాటిల్ సందర్భంగా అఫ్గాన్ ‘ఫ్రీ అఫ్గాన్ విమెన్’ (అఫ్గాన్ మహిళలకు స్వేచ్ఛ కల్పించండి) అనే నినాదం రాసున్న క్లాత్ను తన భుజాలపై వేసుకోవడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు.
దాంతో ఒలింపిక్ బ్రేకింగ్ పోటీల నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తిగా తలాష్ నిలిచింది. ఒలింపిక్స్ పోటీలు జరిగే చోట, పోడియం వద్ద పొలిటికల్ స్టేట్మెంట్స్, నినాదాలు చేయడం నిషేధం. తలాష్ రాజకీయ నినాదాన్ని ప్రదర్శించడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించనట్టు వరల్డ్ డ్యాన్స్స్పోర్ట్ ఫెరడేషన్ ప్రకటించింది.