
-
ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం
పారిస్ ఒలింపిక్స్లో వంద గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయినా.. తన ఆటతో అందరి మనసులు గెలిచిన ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఘన స్వాగతం లభించింది. పారిస్ నుంచి శనివారం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతు దారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి 130 కిలోమీట్లర దూరంలోని తన స్వగ్రామానికి వెళ్లే దారిలో వినేశ్ను ప్రజలు సన్మానించారు. తనపై చూపిస్తున్న ఇంతటి ప్రేమ, గౌరవం తనకు వెయ్యి ఒలింపిక్ బంగారు పతకాల కంటే ఎక్కువ అని వినేశ్ చెప్పారు.
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో తనకు బంగారు పతకం లభించపోయినా.. ప్రజలు, అభిమానులు చూపిస్తున్న ప్రేమ తనకు వెయ్యి స్వర్ణాల కంటే ఎక్కువ అని ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తెలిపింది. పారిస్ నుంచి శనివారం స్వదేశానికి తిరిగొచ్చిన ఫొగాట్కు ఢిల్లీ ఎయిర్పోర్టు వద్ద భారీ సంఖ్యలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒలింపిక్స్లో దురదృష్టం వెంటాడి పతకం కోల్పోయిన ఫొగాట్కు తమ మద్దతు తెలిపారు. రెజ్లింగ్ స్టార్స్ బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్, హర్యానాకు చెందిన పంచాయత్ లీడర్లు ఆమెను రిసీవ్ చేసుకున్నారు.
ఎయిర్పోర్టు నుంచి బయటికి రాగానే వినేశ్కు పూల దండలు వేశారు. ప్రజలను చూసిన వెంటనే వినేశ్ భావోద్వేగానికి గురవగా.. భర్త సోమ్వీర్, బజ్రంగ్ ఆమెను ఓదార్చాడు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో నిల్చున్న ఫొగాట్ రెండు చేతులు జోడించి ఫ్యాన్స్కు కృతజ్ఞతలు తెలిపింది. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఆమెకు స్వీట్ తినిపించి గదను బహూకరించారు.
అనర్హత
ఒలింపిక్స్లో 50 కేజీ విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్.. స్వర్ణ పతక పోరు ముందు100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ కేసు కారణంగా ఆలస్యంగా తిరిగొచ్చిన వినేశ్కు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభించింది. ఎయిర్పోర్టు నుంచి స్వగ్రామం హర్యానాలోని బలాలికి వెళ్లిన వినేశ్ పలు ప్రాంతాల్లో తన కోసం వేచి ఉన్న అభిమానులను కలిసింది. కాప్ పంచాయత్లు వినేశ్ను సన్మానించడంతో 135 కి.మీ. ప్రయాణానికే దాదాపు 10 గంటలు పట్టింది. ఓ చోట భారీ సంఖ్యలో అభిమానులను చూసిన వినేశ్ ‘వాళ్లు నాకు బంగారు పతకం ఇవ్వకపోతే ఏంటి? ఇక్కడి ప్రజలు ఇచ్చారు. నేను పొందిన ప్రేమ, గౌరవం వెయ్యి ఒలింపిక్ బంగారు పతకాలు గెలవడం కంటే ఎక్కువ అనిపిస్తోంది’ అని చెప్పింది.