
పారిస్: ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. పారిస్ ఒలింపిక్స్లో క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టారు. సోమవారం గ్రూప్–సిలో జరగాల్సిన రెండో మ్యాచ్లో సాత్విక్ జోడీ.. మార్క్ లమ్స్ఫస్–-మార్విన్ సిడెల్ (జర్మనీ)తో తలపడాల్సి ఉంది. కానీ మోకాలి గాయంతో లమ్స్ఫస్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. ఇదే గ్రూప్ మరో మ్యాచ్లో ఫ్రెంచ్ జోడీ రోనన్ లాబర్–లుకాస్ కోర్వి 13–21, 10–21తో వరల్డ్ ఏడో ర్యాంకర్లు మహ్మద్ రియాన్ అర్డియాంటో–అల్ఫియన్ ఫజార్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. దీంతో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన లాబర్ జంట గ్రూప్ నుంచి వైదొలగడంతో సాత్విక్ ద్వయానికి క్వార్టర్స్ బెర్త్ ఖాయమైంది.
ఓవరాల్గా ఇండియా తరఫున డబుల్స్ క్వార్టర్స్ చేరిన తొలి జోడీగా సాత్విక్–చిరాగ్ రికార్డులకెక్కారు. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 21–19, 21–14తో జూలియన్ కరాగీ (బెల్జియం)పై గెలిచాడు. కానీ, గ్రూప్ తొలి మ్యాచ్లో కెవిన్ కార్డన్ (గ్వాటెమాల)పై అతను విజయం సాధించిన విజయాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎడమ మోచేతి గాయంతో కార్డన్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. రూల్స్ ప్రకారం ఈ మ్యాచ్ రిజల్ట్ను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఇండోనేసియా స్టార్ జొనాథన్ క్రిస్టీతో జరిగే మ్యాచ్లో లక్ష్యసేన్ గెలిస్తేనే నాకౌట్కు వెళ్లే చాన్స్ ఉంటుంది
అశ్విని జంట ఔట్
విమెన్స్ డబుల్స్లో వెటరన్ షట్లర్ అశ్విని పొన్నప్ప– యంగ్స్టర్ తనీషా క్రాస్టో విమెన్స్ డబుల్స్లో వరుసగా రెండో పరాజయంతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టారు. గ్రూప్–సి రెండో పోరులో అశ్విని–తనీషా 11–21, 12–21తో వరుస గేమ్స్లో వరల్డ్ నంబర్. 4, జపాన్ జంట నమి మత్సుయామ–చిహారు షిడా చేతిలో ఓడిపోయారు.
ఆర్చర్లు క్వార్టర్స్లోనే
ఆర్చరీలో ఇండియా నిరాశ పరుస్తూనే ఉంది. మహిళల జట్టుతో పాటు పురుషుల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్తోనే సరిపెట్టింది. సీనియర్ తరుణ్ దీప్ రాయ్, తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన జట్టు క్వార్టర్స్లో 2–6తో టర్కీ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. 53–57, 52–55తో తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత 55–54తో మూడో సెట్లో ఇండియా పుంజుకుంది. కానీ, నాలుగో సెట్లో టర్కీ ఆర్చర్లు మళ్లీ జోరు పెంచారు. నాలుగు పర్ఫెక్ట్ టెన్స్తో పాటు రెండుసార్లు 9 పాయింట్లు రాబట్టి 58 స్కోరు చేశారు. ఇండియా 54 స్కోరు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.
హర్మీత్ ఓటమి
టేబుల్ టెన్నిస్ లో హర్మీత్ దేశాయ్ రెండో రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. మెన్స్ సింగిల్స్ రెండో పోరులో హర్మీత్ 0--–4తో ఫ్రాన్స్కు చెందిన ఫెలిక్స్ లెబ్రన్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.