
- ఒలింపిక్ మెడల్ గెలిచిన దేశతొలి మహిళా షూటర్గా రికార్డు
- 12 ఏండ్ల తర్వాత షూటింగ్లో ఇండియాకు పతకం
- ఫైనల్లో రమిత, అర్జున్
ఇండియా టాప్ షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 12 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ.. పారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు తొలి మెడల్గా బ్రాంజ్ అందించింది. విమెన్స్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తన గురితో అదరగొట్టి పోడియంపైకి వచ్చిన మను.. విశ్వక్రీడల్లో పతకం గెలిచిన దేశ తొలి షూటర్గా చరిత్రకెక్కింది. మరో ఇద్దరు షూటర్లు రమిత జిందాల్, అర్జున్ బబూట ఫైనల్ చేరగా.. తెలంగాణ బిడ్డలు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ.. బాక్సింగ్, టీటీలో అద్భుత విజయాలతో శుభారంభం చేశారు. హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్పై గురిపెట్టిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా పారిస్ గేమ్స్ను విక్టరీతో ఆరంభించింది. మొత్తానికి పతక ఖాతా తెరవడంతో పాటు పలు ఈవెంట్లలో మెప్పించిన ఇండియా పోటీల రెండో రోజును సానుకూలంగా ముగించింది.
చటౌరాక్స్ (ఫ్రాన్స్): పిస్టల్ క్వీన్ మను భాకర్ ఒలింపిక్స్లో మెడల్ నెగ్గిన ఇండియా తొలి మహిళగా నిలిచిన వేళ పారిస్లో ఇండియా పతకాల ఖాతా తెరించింది. ఆదివారం జరిగిన విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను మూడో ప్లేస్లో నిలిచి కంచు పతకం గెలిచింది. ఎనిమిది మంది పోటీ పడ్డ తుది పోరులో భాకర్ 221.7 స్కోరు సాధించింది. సౌత్ కొరియాకు చెందిన కిమ్ యెజీ 241.3 స్కోరుతో సిల్వర్ నెగ్గగా, అదే దేశానికి చెందిన జిన్ యె ఒహ్ 243.3తో ఒలింపిక్ రికార్డు సృష్టిస్తూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. షూటింగ్లో ఇండియా చివరగా 2012 లండన్ ఒలింపిక్స్లో మెడల్స్ సాధించింది. ఆ ఎడిషన్లో విజయ్ కుమార్సిల్వర్, గగన్ నారంగ్ బ్రాంజ్ గెలిచారు. రియో, టోక్యో గేమ్స్లో మన షూటర్లు తీవ్రంగా నిరాశ పరచగా.. ఈసారి ఇండియాకు తొలి మెడల్ షూటింగ్ నుంచే రావడం విశేషం. మను 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్తోపాటు 25 మీటర్ల పిస్టల్లో నూ పోటీ పడనుంది.
మెరిసిన రమిత, అర్జున్
తొలి రోజు మిక్స్డ్ ఈవెంట్లో కలిసి పోటీ పడి నిరాశ పరిచిన రమిత జిందాల్, అర్జున్ బబూట వ్యక్తిగత ఈవెంట్లలో సత్తా చాటారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్లో రమిత 631.5 స్కోరుతో ఐదో ప్లేస్లో నిలిచి ఫైనల్కు క్వాలిఫై అయింది. తోటి షూటర్ ఎలవెనిల్ వలారివన్ 630.7 స్కోరుతో పదో ప్లేస్ నిలిచి కొద్దిలో ఫైనల్ బెర్తు చేజార్చుకుంది. క్వాలిఫికేషన్లో టాప్8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్తు లభింస్తుంది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత పోటీల్లో అర్జున్ బబూట ఏడో ప్లేస్తో ఫైనల్ చేరాడు. 25 ఏండ్ల అర్జున్ 105.7, 104.9, 105.5, 105.4, 104.0, 104.6 వరుస షాట్లతో 630.1 పాయింట్ల స్కోరుతో టాప్8లో చోటు దక్కించుకున్నాడు. ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ సందీప్ సింగ్ 629.3 స్కోరుతో 12వ స్థానంతో సరిపెట్టి పారిస్లో తన ఆట ముగించాడు. సోమవారం జరిగే ఫైనల్లో రమిత, అర్జున్ పతక అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.