
పారిస్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. మూడో ఒలింపిక్ మెడల్ వేటలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై గెలిచింది. ఆట స్టార్టింగ్ నుంచే సూపర్ షాట్స్తో చెలరేగిన తెలుగమ్మాయి 29 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది.
మంగళవారం జరిగే రెండో మ్యాచ్లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. మెన్స్ సింగిల్స్ గ్రూప్–కే మ్యాచ్లో హెచ్. ఎస్. ప్రణయ్ 21–18, 21–12తో ఫ్యాబియాన్ రోత్ (జర్మనీ)పై నెగ్గాడు. శనివారం రాత్రి జరిగిన విమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో 18–21, 10–21తో కిమ్ సో యియోంగ్–కాంగ్ హి యంగ్ (కొరియా) చేతిలో ఓడారు.