
- పారాలింపిక్స్లో రెండోసారి స్వర్ణం నెగ్గిన లేఖరా
- ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా చరిత్ర
- మనీష్కు రజతం, మోనా, ప్రీతి పాల్కు కాంస్యాలు
- పారిస్లో ఇండియాకు ఒక్క రోజే నాలుగు పతకాలు
దేశ క్రీడా చరిత్రలో ఒక అథ్లెట్ వరుసగా రెండు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు నెగ్గింది లేదు. హాకీ జట్టు తప్పితే వ్యక్తిగతంగా ఒక్కరు కూడా ఈ ఘనత అందుకోలేక పోయారు. టోక్యోలో బంగారు పతకం గెలిచిన నీరజ్ చోప్రా పారిస్లో చాలా దగ్గరగా వచ్చినప్పటికీ ఈ రికార్డు సాధించలేకపోయాడు. కానీ, పారాలింపిక్స్లో ఇండియా పారా షూటర్ అవని లేఖరా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వరుసగా రెండు పారాలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచి ఈ ఘనత సాధించిన దేశ తొలి అథ్లెట్గా చరిత్రకెక్కింది.వైకల్యాన్ని అధిగమించి ఆటలో అద్భుతాలు చేస్తున్న అవని టోక్యోలో గెలిచిన స్వర్ణాన్ని పారిస్లోనూ నిలబెట్టుకొని తన గురికి ఎదురులేదని నిరూపించింది.
పారిస్ : ఒలింపిక్స్లో ఇండియా ఆటగాళ్లంతా కలిసి ఆరు పతకాలు సాధిస్తే.. అదే పారిస్ గడ్డపై పారా ఒలింపిక్స్లో ఒక్క రోజే మన పారా వీరులు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు. స్టార్ షూటర్ అవని లేఖరా స్వర్ణంతో పతకాల బోణీ చేయగా మరో ఇద్దరు షూటర్లు మనీశ్ నర్వాల్ రజతం, మోనా అగర్వాల్ కాంస్యం గెలిచారు. స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్యం పతకం అందుకుంది. పోటీల రెండో రోజు శుక్రవారం జరిగిన ఎస్హెచ్1 విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అవని అంచనాలు అందుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 249.7 స్కోరుతో టాప్ ప్లేస్తో గోల్డ్ గెలిచింది. ఈ క్రమంలో మూడేండ్ల కిందట టోక్యోలో 249.6 స్కోరుతో నెలకొల్పిన పారాలింపిక్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే పోటీలో 37 ఏండ్ల మోనా 228.7 స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఇండియా పారాలింపిక్ హిస్టరీలో ఇద్దరు షూటర్లు ఒకే ఈవెంట్లో పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కొరియాకు చెందిన యుర్నీ లీ 246.8 స్కోరుతో రజతం గెలిచింది. కాగా, అవని 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లోనూ పోటీ పడనుంది. టోక్యో గోల్డ్ మెడలిస్ట్ మనీశ్ నర్వాల్ మరోసారి బంగారు పతకం గెలిచేందుకు పోరాడినా చివరికి రజతంతో సరిపెట్టాడు. ఎస్హెచ్1 మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ఫైనల్లో 22 ఏండ్ల మనీశ్ 234.9 స్కోరుతో రెండో స్థానం సాధించాడు. కొరియా షూటర్ జొయెంగ్డు జో 237.4 స్కోరుతో గోల్డ్ గెలిచాడు. ఎస్హెచ్1 కేటగిరీలో చేతులు, చాతి కింది భాగంలో, కాళ్లలో సరిగ్గా కదలిక లేనివాళ్లు లేదా అవయవాలు కోల్పోయిన క్రీడాకారులు పోటీ పడతారు.
అథ్లెటిక్స్లో తొలి పతకం
పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో ఇండియాకు తొలి పతకం అందించిన అథ్లెట్గా ప్రీతి పాల్ నిలిచింది. టీ35 విమెన్స్ 100 మీటర్ల ఈవెంట్లో ఆమె కాంస్యం గెలిచింది. ఫైనల్లో 23 ఏండ్ల ప్రీతి తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ 14.21 సెకన్లతో మూడో స్థానంతో పోటీని పూర్తి చేసింది. చైనాకు చెందిన జొయు జియా (13.58 సె), గువో క్వియాంక్విన్ (13.74సె) గోల్డ్, సిల్వర్ గెలిచారు. హైపర్టోనియా, అటాక్సియా, అథెటోసిస్ వంటి వ్యాధులు, మస్తిష్క పక్షవాతం వంటి సమస్యలు ఉన్న క్రీడాకారుల కోసం టీ35 కేటగిరీ పోటీలు నిర్వహిస్తారు.
ధీర వనిత
11 ఏండ్ల చిన్నారి. హుషారుగా స్కూలుకు వెళ్తోంది. చదువుతో పాటు ఆట పాటల్లోనూ ఆసక్తి చూపిస్తోంది. ఓ రోజు స్కూల్లో డ్యాన్స్ పోటీలో పాల్గొనేందుకు పట్టు బట్టి మరీ అమ్మానాన్నతో కలిసి కారులో బయల్దేరింది. కానీ, మార్గమధ్యలో కారు ప్రమాదానికి గురవ్వడంతో ఆ చిన్నారి వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నది. నడుం కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఒకరి సాయం లేకుండా కనీసం కదల్లేని పరిస్థితిలో ఆ చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది.
12 ఏండ్లు గిర్రున తిరిగాయి. నాడు కారు ప్రమాదంలో సగం శరీరాన్ని కోల్పోయిన ఆ అమ్మాయి వరుసగా రెండు పారాలింపిక్స్లో మన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా నిలబెట్టింది. 22 ఏండ్లకే దేశ పారా క్రీడల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. తనే అవని లేఖరా. ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.
మూడేండ్ల కిందట టోక్యో పారా గేమ్స్లో రెండు పతకాలు గెలిచి (స్వర్ణం, కాంస్యం) ఇండియా పారా గేమ్స్లో తన పేరు మార్మోగేలా చేసుకున్న అవని లేఖరాకు విజయాలు కొత్తేం కాదు. 2015లో తుపాకీ పట్టినప్పటి నుంచి ఆమె పతకాల మోత మోగిస్తూనే ఉంది.
జైపూర్కు చెందిన అవని ఆర్చర్ అవబోయి షూటర్ అయింది. 2012లో రోడ్డు ప్రమాదంతో వీల్ చైర్కి పరిమితమైన లేఖరా కోలుకునేందుకు తండ్రి ప్రవీణ్ ఆమెకు ఆటలు అలవాటు చేశాడు. తొలుత ఆర్చరీ ఎంచుకున్న అవని కొన్నాళ్లకు లెజెండరీ అభినవ్ బింద్రా విజయాలతో స్పూర్తి పొంది 2015లో షూటింగ్కి మారింది. క్రమశిక్షణ, ఏకాగ్రతతో లక్ష్యంపై గురి పెట్టడం తెలిసిన అవని తక్కువ సమయంలోనే తుపాకీపై పట్టు పెంచుకుంది. జూనియర్, సీనియర్ లెవెల్స్లో వరల్డ్ రికార్డులు నెలకొల్పి టీనేజ్లోనే
ఈ ఆటలో తనదైన ముద్ర వేసింది. 2021 టోక్యో పారాలింపిక్స్తో ఆమె కెరీర్ అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. దాంతో పారిస్ లోనూ ఆమె ఫేవరెట్గా నిలిచింది. కానీ, ఈ గేమ్స్కు ముందు పలు అనారోగ్య సమస్యలతో అవని ఇబ్బందిపడింది. గాల్ బ్లాడర్ సర్జరీ కారణంగా ఒకటిన్నర నెలల పాటు ఆటకు దూరమైంది. బరువు కూడా తగ్గింది. కానీ, తన ఫోకస్ మాత్రం తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో. నిండైన ఆత్మవిశ్వాసంతో పారిస్కు వచ్చిన అవని స్వర్ణంతో మెరిసి.. దేశాన్ని మురిపించింది.
- (వెలుగు స్పోర్ట్స్ డెస్క్)