
- రోడ్లపై వాహనాల నిలుపడంతోట్రాఫిక్ జామ్
- ఎక్స్రే, ల్యాబ్, స్టోర్ రూమ్లుగా సెల్లార్లు
- ఎమర్జెన్సీ రూట్లపై నిర్లక్ష్యమే..
- జిల్లాలోని 546 హాస్పిటళ్లలో ఇదే పరిస్థితి
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో పార్కింగ్ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవన నిర్మాణ సమయంలో పర్మిషన్ కోసం పార్కింగ్ స్థలం చూపి తర్వాత వాటి రూపాన్ని మార్చేస్తున్నారు. దీంతో రోగులను చూసేందుకు వచ్చే వారు రోడ్లపైనే వాహనాలు నిలుపడంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. సెల్లార్లలో ఎక్స్రే, ల్యాబ్, స్టోర్ రూంలను ఏర్పాటు చేసి, మిగిలిన కొద్దిపాటి స్థలంలో డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది వాహనాల పార్కింగ్కు అనుమతిస్తున్నారు. రోగులు, వారి కోసం వచ్చే వారి వాహనాల పార్కింగ్కు వారి చిత్తానికే వదిలేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లు, ఇతర డయాగ్నాస్టిక్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడం గమనార్హం.
పేపర్లలోనే పార్కింగ్ పర్మిషన్..
జిల్లాలో 546 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మల్టీ సూపర్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోమ్స్, ఇతర హాస్పిటళ్లు 356 కాగా, సుమారు ఏడు వేల బెడ్లతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. 103 డెంటల్ హాస్పిటల్స్, 202 డయాగ్నాస్టిక్ సెంటర్లు, 126 అల్ట్రా స్కానింగ్, 17 సీటీ స్కానింగ్ కేంద్రాలు, బెడ్స్లేని క్లినిక్లు 87 ఉన్నాయి. ప్రతి హాస్పిటల్కు విధిగా వాహనాల పార్కింగ్ ఉండాలి.
బెడ్ల సంఖ్య, దవాఖాన స్థాయిని బట్టి పార్కింగ్ ప్లేస్ నిర్ణయిస్తారు. ఫైర్ యాక్సిడెంట్స్ లేక ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు మెట్లు, లిఫ్ట్ కాకుండా ప్రత్యామ్నాయ దారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉంటే డీఎంహెచ్ వో పర్మిషనిచ్చి ఏటా రెన్యూవల్ చేస్తారు. రూల్స్ అతిక్రమిస్తే పర్మిషన్ క్యాన్సిల్ చేసే పవర్ ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.
ఖలీల్వాడీ, ప్రగతి నగర్ తదితర ఏరియాలు ప్యాక్..
సుమారు 7 వేల బెడ్స్తో ప్రైవేట్ హాస్పిటల్స్ కొనసాగుతుండగా, 700 మంది డాక్టర్లే ఉన్నారు. ఏవరేజ్ ఓపీ 20 వేల దాకా ఉంటుంది. రోగులను తీసుకొచ్చే ఆటోలు, కార్లు, చూసేందుకు వచ్చేవారు బైక్ లు పార్కింగ్ చేసేందుకు స్థలాలు లేక గోసపడుతున్నారు. నిజామాబాద్ పట్టణంలో కొత్త బస్టాండ్ వెనుకున్న ఖలీల్ వాడీ మొదలుకొని వీక్లీ మార్కెట్, కోర్ట్ కాంప్లెక్స్ వెనుక భాగం, మున్సిపల్ కాంప్లెక్స్, జిల్లా లైబ్రరీ, సరస్వతీనగర్, ప్రగతి నగర్ ఏరియాల్లోని ప్రైవేట్ హాస్పిటళ్లలో పార్కింగ్ జాగ లేక విపరీతమైన ట్రాఫిక్ జామవుతుంది. వాహికల్స్ను ఇరుకు రోడ్లపై నిలబెట్టడంతో కాలనీల్లో సొంతింట్లో ఉండేవారు సైతం బయటకు రావాలంటే ట్రాఫిక్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
యెండల టవర్స్ వైపు కొత్తగా వెలుస్తున్న హాస్పిటళ్లలోనూ పార్కింగ్కు స్థలాలు కేటాయించకపోవడం గమనార్హం. దవాఖాన సెల్లార్లలో ఎక్స్రే, పాథలాజికల్ ల్యాబ్, స్టోర్ రూంల కోసం వాడుతున్నారు. స్కానింగ్ సెంటర్లలో సెల్లార్లను క్లోజ్ చేస్తుండడంతో వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కాక రోడ్లపైనే నిలపడంతో కాలనీలు ప్యాక్ అవుతున్నాయి. బోధన్ టౌన్లోని కొత్త బస్టాండ్ వెనుక సరస్వతీనగర్ రోడ్ కూడా హాస్పిటల్కు వచ్చిన వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మూర్, భీంగల్, నందిపేట పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉంది. అత్యవసర వేళ ఉపయోగించడానికి కావాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ను హాస్పిటళ్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
మున్సిపల్ ఆఫీసర్లు సహకరించాలి
ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నాస్టిక్, స్కానింగ్ సెంటర్లలో పార్కింగ్ మెయింటెన్ లేక ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. మున్సిపాలిటీలు ఇచ్చిన పర్మిషన్లలో పార్కింగ్ ఏరియా క్లియర్గా ఉంటుంది. కానీ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్లార్లలో ఎక్స్రే, ల్యాబ్, స్టోర్రూంలను ఏర్పాటు చేయడం వల్ల పార్కింగ్ సమస్య వస్తుంది. బల్దియా ఆఫీసర్లు యాక్షన్ తీసుకోవాలి. పార్కింగ్ సమస్యపై పలు మార్లు లెటర్ల ద్వారా కోరినా ఫలితం దక్కలేదు.
నారాయణ, ఏసీపీ ట్రాఫిక్