దవాఖానల్లో పార్కింగ్​ దందా!..కార్పొరేట్, సర్కారు హాస్పిటళ్లలో జీఓ 63కి విరుద్ధంగా అక్రమ వసూళ్లు

దవాఖానల్లో పార్కింగ్​ దందా!..కార్పొరేట్, సర్కారు హాస్పిటళ్లలో జీఓ 63కి విరుద్ధంగా అక్రమ వసూళ్లు
  • మొదటి అరగంట ఫ్రీ అస్సలే లేదు  
  • బిల్లు చూపిస్తే గంట పాటు ఉచితం రూల్ పాటిస్తలేరు 
  •  ఏజెన్సీలను నియమించుకొని అడ్డగోలు వసూళ్లు 
  • యాక్షన్​తీసుకునే అథారిటీ లేదంటున్న బల్దియా  

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో పార్కింగ్​పేరిట దోపిడీ కొనసాగుతోంది. షాపింగ్​మాల్స్ తో పాటు కార్పొరేట్​హాస్పిటల్స్, సర్కారు దవాఖానలు ప్రభుత్వ జీఓను పట్టించుకోకుండా వాహనదారుల దగ్గర పార్కింగ్​ఫీజు వసూలు చేస్తున్నాయి. మాల్స్, హాస్పిటల్స్, కమర్షియల్​కాంప్లెక్స్​లకు వచ్చే వాహనదారులకు పార్కింగ్​సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదే అంటూ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో అప్పటి ప్రభుత్వం 2018లో జీఓ63ని జారీ చేసింది.

బిల్డింగ్​నిర్మించే టైంలో బిల్డింగ్ స్పేస్​లో 40 శాతం పార్కింగ్​కు స్పేస్ కేటాయిస్తున్నట్టు చూపి పర్మిషన్​తీసుకుంటారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా పార్కింగ్​ఫీజు తీసుకోకూడదని జీఓ చెప్తున్నది. జీఓలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విధి విధానాలను పొందుపరిచింది. కానీ, ఆ జీఓను ఎవరూ పట్టించుకోవడం లేదు.

జీఓ 63 ఏం చెప్తుందంటే..

షాపింగ్​మాల్స్, ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఎవరైనా తమ వెహికల్​పార్క్​చేస్తే మొదటి అరగంట ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. 30 నిమిషాలు దాటి గంటలోపు అయితే ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్టు బిల్లు చూపిస్తే సరిపోతుంది. ఆ వస్తువు విలువ ఎంత ఉన్నా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ పార్కింగ్​సమయం గంట దాటితే పార్కింగ్​ఫీజు కంటే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే సరిపోతుంది. ఈ రూల్స్​కు విరుద్ధంగా ఎవరైనా వసుళ్లకు పాల్పడుతున్నట్టయితే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ లేదా టౌన్ ప్లానింగ్ ఏసీపీలకు ఫిర్యాదు చేయొచ్చు. వారు కూడా నిర్లక్ష్యం వహిస్తే నేరుగా బల్దియా హెడ్ ఆఫీసులో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. కాగా, ఈ రూల్స్​సింగిల్​ స్క్రీన్​ థియేటర్లకు మాత్రం వర్తించవు.  

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​లో.. 

జూబ్లీహిల్స్ లోని పేరు మోసిన ఓ కార్పొరేట్​దవాఖానలో పార్కింగ్​పేరిట అందినకాడికి దండుకుంటున్నారు. ఇక్కడ ఫోర్ వీలర్ కు 3 గంటల్లోపు మినిమం రూ.50, టూ వీలర్ అయితే 5 గంటల్లోపు మినిమం రూ.30 తీసుకుంటున్నారు. ఈ సమయం దాటిన తర్వాత కారుకు అదనంగా గంటకు రూ.20, టూవీలర్ కు రూ.10 చొప్పున కలెక్ట్​చేస్తున్నారు. కారుకు12 గంటలకు పాస్ తీసుకునే ఫెసిలిటీ కూడా కల్పించి రూ.100,  బైక్ పాస్ అయితే రోజుకు రూ.50 వసూలు చేస్తున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లో ఉన్న ఓ పిల్లల కార్పొరేట్​దవాఖానలోనూ పార్కింగ్ పేరిట బాదుతున్నారు. 

సారీ సర్.. మాకు అథారిటీ లేదు

హైడ్రా రాక ముందు బల్దియాలో భాగమైన ఈవీడీఎం పార్కింగ్ కి సంబంధించి కంప్లయింట్స్​వస్తే చర్యలు తీసుకునేది. పెనాల్టీలు వేసి కంప్లయింట్​చేసిన వారికి సమాధానం ఇచ్చేవారు. హైడ్రా వచ్చాక ఈవీడీఎంలోని కొన్ని బాధ్యతలను వారికి అప్పగించింది. పార్కింగ్ కు సంబంధించిన సమస్యలను బల్దియాకే అప్పజెప్పడంతో వారు లైట్​తీసుకుంటున్నారు.

పార్కింగ్ ఫీజులపై ఎవరు ఫిర్యాదు చేస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో హెల్ప్​ లైన్ నెంబర్ 040–21111111 కి కాల్ చేస్తే ఫిర్యాదులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ నంబర్​కు కాల్ చేస్తే తమకు పార్కింగ్ కి సంబంధించి ఫిర్యాదు తీసుకునే అథారిటీ లేదని చెప్తున్నారు. గత నెల 20న జూబ్లీహిల్స్ లోని ఓ హాస్పిటల్​లో పార్కింగ్​ఫీజు తీసుకోగా, సాయంత్రం 5.32 గంటలకు కాల్ చేయగా తమకు ఫిర్యాదు తీసుకునే అవకాశం లేదని సుహాసిని అనే టెలీకాలర్​సమాధానం ఇచ్చారు.

కొంతమంది నేరుగా డిప్యూటీ కమిషనర్​కు కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇటీవల బంజారాహిల్స్ లోని ఓ పిల్లల దవాఖానలో జీవో రూల్స్​కు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారని నేరుగా జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. టౌన్ ప్లానింగ్ వాళ్లను పంపి విచారిస్తామని చెప్పి వదిలేశారు. అంతలోనే ఆ డిప్యూటీ కమిషనర్ బదిలీ అయ్యారు.  
 
పంజాగుట్ట నిమ్స్​లోనూ..

పంజాగుట్ట నిమ్స్​లో పార్కింగ్​దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇక్కడ ఎన్నో ఏండ్లుగా పార్కింగ్​దందా కొనసాగుతోంది. ఇక్కడ టూ వీలర్లకు మూడు, నాలుగు చోట్ల స్థలాలు కేటాయించి పార్కింగ్​ఫీజు తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఫోర్​వీలర్స్​ను నిమ్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్క్​చేసి ఫీజు వసూలు చేసేవారు. రెండేండ్లుగా అదనపు బిల్డింగ్​నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇప్పుడు కార్లను బాజాప్తా నిమ్స్​లోపలకు వచ్చే రోడ్లకు ఇరువైపులా పార్క్​చేయిస్తున్నారు. దీనివల్ల  పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఫోర్​వీలర్ కు 12 గంటలైతే రూ.40, టూవీలర్ కు రూ.20 తీసుకుంటున్నారు.

జీవో 63 ప్రకారం ఇక్కడ కూడా మొదటి అరగంట ఉచితం కాగా, అరగంట నుంచి గంట వరకు ఓపీ స్లిప్​లేదా టెస్టులు చేయించుకున్నట్టు ఉన్న బిల్లు చూపించినా సరిపోతుంది. కానీ ఈ విషయం పేషెంట్స్​వారి బంధువులకు తెలియకపోవడంతో పార్కింగ్​నిర్వాహకులు ప్రతి నెలా లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. కొంత కాలం కింద ఈవీడీఎం ఉన్న టైంలో నిమ్స్ లో హాస్పిటల్ బిల్లు చెల్లించిన రశీదు చూపినా కూడా పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారని ఓ పేషెంట్​బంధువు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్కింగ్ ఏజెన్సీకి రూ.50వేల ఫైన్ విధించారు.

అలాగే, ఆ ఏజెన్సీని తొలగించాలని హాస్పిటల్ డైరెక్టర్ కు సూచించారు. ఆ తర్వాత హైడ్రా రావడం, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు కూడా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నగరంలోని పలు ఏరియా హాస్పిటల్స్​లోనూ పార్కింగ్ దందా కొనసాగుతోంది.  ‘మాల్స్, బస్టాండ్లు, మెట్రోలో పార్కింగ్ బాదుడు’   - రేపటి సంచికలో