
- బీఆర్ఎస్కు ఇజ్జత్కా సవాల్గా మారిన మెదక్ సెగ్మెంట్
- ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఫోకస్
- అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు
మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మెజార్టీ లోక్సభ సీట్లు గెలిచి, పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్ సభ స్థానంలో గెలుపు ఆ పార్టీకి ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ఈ మేరకు అభ్యర్థిని ఖరారు చేసిన ఆ పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. మెదక్ లోక్సభ సెగ్మెంట్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సెగ్మెంట్పరిధిలో పార్టీకి 2.40 లక్షల ఓట్ల మెజార్టీ లభించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సులువేనని ఆ పార్టీ లీడర్లు భావించారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గెలుపు ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జన పడడం ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్, బీజేపీనుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ లేదా మాజీ సీఎం కేసీఆర్ లో ఎవరోఒకరు పోటీ చేయొచ్చన్న వార్తలు వినిపించాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈయన గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు.
మీటింగ్లతో క్యాడర్ సన్నద్ధం...
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్లో స్తబ్ధత నెలకొంది. ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్పార్టీలోకి వెళ్లారు. పార్లమెంట్ఎన్నికల షెడ్యూల్ వెలువడి, అభ్యర్థి ఖరారు కావడంతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగులు పూర్తి కాగా, మిగతా సెగ్మెంట్లలోనూ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
18.12 లక్షల ఓటర్లు..2,124 పోలింగ్స్టేషన్లు
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ లోక్సభ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 18,12,858 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,95,777 మంది కాగా, 9,16,876 మంది మహిళలు, 205 మంది ట్రాన్స్జెండర్లున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46 మండలాల్లో 2,124 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ ఇప్పటికే పూర్తయింది.