బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సుల రాక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. రోడ్డుపైనే నిలుపుతుండటంతో గంటలకొద్ది నిరీక్షించాల్సి వస్తోంది.  బస్టాండ్​లోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని  ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఇంత వరకు స్పందించలేదని చెబుతున్నారు.

బుధవారం కామారెడ్డి నుంచి జేబీఎస్​ వెళ్తున్న  కామారెడ్డి ఆర్టీసీ డిపో బస్సు భిక్కనూరు బస్టాండ్​లోకి వెళ్లకపోవడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కొందరు బైక్​లపై బస్సును వెంబడించి అడ్డుకున్నారు. బస్టాండ్​లోకి ఎందుకు రావడంలేదని డ్రైవర్​ను నిలదీయడంతో  బాలుర పాఠశాల నుంచి మళ్లీ బస్టాండ్​కు వెళ్లి ప్రయాణికుడిని ఎక్కించుకొని వెళ్లాడు. బస్సులు బస్టాండ్​లోకి వచ్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.