![పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం](https://static.v6velugu.com/uploads/2025/02/pathagutta-lakshmi-narasimha-swamy-temple-brahmotsavams-begin-with-traditional-rituals_0mPLSakliG.jpg)
- స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన అర్చకులు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా అర్చకులు పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి, లక్ష్మీనారసింహులకు రక్షాబంధనం చేశారు. తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సాయంత్రం అంకురారోపణం, మృత్సంగ్రహణం నిర్వహించారు.
శుక్రవారం మొదలైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 వరకు వారం రోజుల పాటు జరగనున్నాయి. కార్యక్రమంలో చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్రావు, డిప్యూటీ ఈవో భాస్కర్శర్మ, ఏఈవో జూశెట్టి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.