హోరాహోరీగా ఖమ్మం జిల్లా గ్రానైట్ అసోసియేషన్​ ఎన్నికలు

హోరాహోరీగా  ఖమ్మం జిల్లా గ్రానైట్ అసోసియేషన్​ ఎన్నికలు

ఖమ్మం, వెలుగు: హోరాహోరీగా జరిగిన ఖమ్మం గ్రానైట్ శ్లాబ్, ఫ్యాక్టరీ ఓనర్స్​అసోసియేషన్​ఎన్నికల్లో అధ్యక్షుడిగా పాటిబండ్ల యుగంధర్​ ఎన్నికయ్యారు. శనివారం నగరంలోని హరిత గార్డెన్స్​లో ఉదయం పోలింగ్ జరగ్గా, సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి వేముల రవికుమార్​పై 35 ఓట్ల మెజార్టీతో పాటిబండ్ల యుగంధర్ గెలుపొందారు. ఎన్నికల్లో కార్యదర్శిగా కమర్తపు గోపాల్ రావు, ట్రెజరర్​ గా పరమేశ్వర్​ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రియాజ్​షేక్, ఈసీ మెంబర్లుగా దొండేటి స్వేధన్, పెరుమాళ్లపల్లి రవికుమార్ విజయం సాధించారు.

అసోసియేషన్​ లో మొత్తం 444 ఓటర్లు ఉండగా, ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలింగ్ అనివార్యమైంది. అంతకుముందే వైస్​ ప్రెసిడెంట్లుగా కొనకంచి శ్యామ్​ ప్రసాద్, తమ్మినేని సాగర్, జాయింట్ సెక్రటరీగా చావా రామ్మూర్తి, ఈసీ మెంబర్లుగా అనిల్ కుమార్, లాలాప్రతాప్​, బి.రాజగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎలక్షన్లలో పాటిబండ్ల యుగంధర్ ప్యానల్ విజయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, గ్రానైట్ అసోసియేషన్​ మాజీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత సాదు రమేశ్​రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారిని పలువురు నేతలు అభినందించారు. రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొన్నారు.