
హైదరాబాద్: ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదంలో కాళ్లకు, చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్కు సింగపూర్లో చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే పవన్ తన షెడ్యూల్ ఉన్నఫలంగా క్యాన్సిల్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
దీంతో కుమారుడిని పవన్ కల్యాణ్ ఇండియాకు తీసుకొచ్చారు. భార్య అన్నా లెజినోవా, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి బయలుదేరిన పవన్ ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లారు. ఎయిర్ పోర్టులో పవన్ స్వయంగా కుమారుడిని ఎత్తుకుని నడించారు. పవన్ కల్యాణ్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్ప గాయాల నుంచి బయటపడటంతో మెగా ఫ్యామిలీ, పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.