Pawan Kalyan: అవార్డు అందుకున్న చిరంజీవి.. తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ పవన్ పోస్ట్

Pawan Kalyan: అవార్డు అందుకున్న చిరంజీవి.. తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ పవన్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) యూకే పార్లమెంట్‍లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిష్టాత్మకమైన జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. కళారంగం నుంచి సమాజానికి చేసిన సేవలకు గాను (2025 మార్చి 19న) హౌస్ ఆఫ్ కామన్స్ ఆయనకు ఈ అవార్డు అందజేసి, సత్కరించింది.

ఈ కార్యక్రమాన్ని యూకే లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నిర్వహించారు. ఎంపీలు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మాన్ , ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మెగాస్టార్కి శుభాకాంక్షలు చెబుతూ X వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

పవన్ కళ్యాణ్ మాటల్లోనే.. "యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పవన్ తెలిపారు. 

మెగాస్టార్పై పవన్ ప్రేమ:

సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను.

నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదల చిరంజీవి గారు.

తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను" అని పవన్ కళ్యాణ్ X వేదికగా తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం చిరంజీవి లండన్లో అవార్డు అందుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.