అన్నమయ డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నమయ్య డ్యాం బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం చేస్తామంటూ అధికారులు చేసిన ప్రకటన పై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అధికారులు చెప్పిన విధంగా అన్నమయ్య డ్యాం బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడతారో..? లేదో చూస్తాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు తమ నిబద్ధతను ఎంత వరకు చాటుకుంటారో చూస్తాం. అధికారులవి కంటితుడుపు చర్యలేనని భావిస్తున్నానన్న పవన్..అన్నమయ్య డ్యాం బాధితుల ఇళ్ల నిర్మాణంపై పోరాటం విషయంలో మరో నెల రోజులు వెయిట్ చేస్తామని తన ట్వీట్లో పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే.. కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు.. అంటూ గత ట్వీట్లలో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.