ఆ క్షణం నా మనస్సు బద్దలైంది.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్

ఆ క్షణం నా మనస్సు బద్దలైంది.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ జరిగిన నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి ప్రాయశ్చిత్తంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని చేపడతానని తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు (సెప్టెంబర్ 22) ప్రాయశ్చిత్త  దీక్ష చేపట్టి.. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ఎక్స్‎లో వెల్లడించారు. 

అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని.. జంతు అవశేషాలతో మాలిన్యమైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని విమర్శించిన పవన్.. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని అన్నారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు బద్దలైందని...  ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. 


కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని పవన్ పిలుపునిచ్చారు. నేను 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టి..  దేవదేవా.. నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటానన్నారు. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని మండిపడ్డారు. 

ALSO READ : తెలంగాణ విజయ డైరీ ఆఫర్ : తిరుమల లడ్డూకు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తాం.. తీసుకోండి

నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం.. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పేర్కొన్నారు. ఇక, ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.. ధర్మో రక్షతి రక్షితః అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.