
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో తమ నష్టాలు రూ.290 కోట్లకు తగ్గినట్టు ఫిన్టెక్ మేజర్ పేటీఎం ప్రకటించింది. 2022 రెండో క్వార్టర్లో ఈ సంస్థకు రూ.571 కోట్ల నష్టం వచ్చింది. అయితే తాజా క్వార్టర్లో రెవెన్యూ వార్షికంగా 32 శాతం పెరిగి రూ.2,519 కోట్లకు చేరింది. ఇబిటా రూ.84 కోట్ల నుంచి రూ.153 కోట్లకు పెరిగింది. కంట్రిబ్యూషన్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో వార్షికంగా 69 శాతం పెరిగి రూ.1,426 కోట్లకు చేరింది.
కంట్రిబ్యూషన్ మార్జిన్ 57 శాతం ఉంది. పేమెంట్స్ బిజినెస్ 28 శాతం వృద్ధి చెందింది. దీని నుంచి రూ.1,524 కోట్లు వచ్చాయి. నెట్ పేమెంట్ బిజినెస్ 60 శాతం పెరిగి రూ.707 కోట్లకు చేరింది. పేమెంట్స్ సెగ్మెంట్ నుంచి జీఎంవీ వార్షికంగా 41 శాతానికి పెరిగి రూ.4.5 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి రూ.571 కోట్లు వచ్చాయి. లోన్ కస్టమర్ల సంఖ్య 1.18 కోట్ల మందికి చేరింది. లోన్ల జారీ 122 శాతం పెరిగి రూ.16,211 కోట్లకు ఎగిసిందని పేటీఎం తెలిపింది.