ఆ లీగ్ ఆడేందుకు వీలు లేదు.. స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

ఆ లీగ్ ఆడేందుకు వీలు లేదు.. స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు

అనుకున్నదే జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురు జూలై 25 నుండి ప్రారంభం కానున్న గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ ఆడేందుకు అనుమతి ఇవ్వలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి  నిరాకరిస్తూ..వారి అభ్యర్థనలను తిరస్కరించారు.

వివిధ ఫ్రాంచైజీ లీగుల్లో ఆడే సమయంలో ఫిట్‌గా ఉంటున్న క్రికెటర్లు.. దేశం తరుపున ఆడే మెగా టోర్నీల సమయానికి గాయపడుతున్నారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ త్రయానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. 

పాకిస్థాన్ జట్టులో ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు. బాబర్ అజామ్ కెప్టెన్ కాగా.. మహ్మద్ రిజ్వాన్ ప్రధాన వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. ఇక షహీన్ అఫ్రిది జట్టు తరపున పేస్ బౌలింగ్ ను నడిపిస్తున్నాడు. GT20 ఇప్పటికీ ICCచే ఆమోదించబడలేదు. పాక్ క్రికెట్ బోర్డు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.

అక్టోబర్ 2024 నుంచి మే 2025 మధ్య పాకిస్తాన్ ఈ ఏడు నెలల్లో అన్ని ఫార్మాట్లలో 37 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అలాగే ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. దీంతో ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాధాన్యమివ్వాలని పాక్ క్రికెట్ బోర్డు బలంగా కోరుకుంటుంది. 

Also Read :  ఆ ఇద్దరినే నమ్ముకున్న టీమిండియా

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌'లో పాల్గొనాలనుకున్న పాకిస్థాన్ పేసర్ నసీమ్ షాకు నిరాశ ఎదురైంది. అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిరాకరించింది. ఆసిఫ్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ అమీర్,  మహ్మద్ నవాజ్‌లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆమోదించింది. వీరు పాక్ తరపున టెస్ట్ మ్యాచ్ లు ఆడటం లేదు.