![పారదర్శకంగానే కులగణన సర్వే…ఆధారాల్లేకుండా సర్వేపై కేటీఆర్ మాట్లాడుతుండు: పీసీసీ చీఫ్ మహేశ్](https://static.v6velugu.com/uploads/2025/02/pcc-chief-mahesh-kumar-goud-fires-on-ktr_w6xuWXkavz.jpg)
- దేశానికే ఆదర్శంగా కులగణనఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి ఆధారాల్లేకుండా బీసీ, కులగణన తప్పులు తడక అంటున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎంతో శాస్త్రీయంగా, లక్షకుపైగా సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు తిరిగి గణన చేశామన్నారు. కులగణన దేశానికే ఆదర్శమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఓర్చుకోలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో పూర్తి చేసిందని చెప్పారు. కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదన్నారు.
1931 తర్వాత కులగణన జరిగిందని, దీని వల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంతో పకడ్బందీగా మొదటిసారి కులగణనను చేసిన ఘనత దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ సర్వేపై మాట్లాడడం అవివేకమన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేకపోతున్నారని విమర్శించారు.
కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ-సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.