రాహుల్​పై ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదు : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

రాహుల్​పై ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదు : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​
  • ఆయనపై బీజేపీ కుట్ర చేస్తున్నది
  • గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం
  • గాడ్సే వారసులు దేశాన్ని పాలిస్తున్నరని ఫైర్​
  • రాహుల్​పై బీజేపీ నేతల కామెంట్లకు నిరసనగా హనుమకొండలో ధర్నా

వరంగల్/హుజూరాబాద్, వెలుగు: గాంధీ కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగాలు చేసిందని.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఏనాడైనా దేశం కోసం  జైలుకైనా వెళ్లారని, కనీసం వారి ఇంట్లో కుక్క అయినా దేశం కోసం చనిపోయిందా? అని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ ప్రశ్నించారు. దేశ ప్రజలంతా ప్రధానిగా చూడాలనుకుంటున్న నేత రాహుల్​గాంధీని పట్టుకుని ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని అన్నారు. బుధవారం ఆయన గ్రేటర్​ వరంగల్​లో పర్యటించారు. గీసుగొండలోని నాగమయ్య గుడిని, సిటీలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 

 రాహుల్​గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  హనుమకొండ అంబేద్కర్​ సెంటర్​లో చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘‘గాంధీ కుటుంబంలో మోతీలాల్​ నెహ్రూ, జవహర్​లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ వరకు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. జైలు​ జీవితాలు గడిపారు. దేశాన్ని ప్రస్తుతం గాడ్సే వారసులు పాలిస్తున్నారు” అని అన్నారు.  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కనుసన్నల్లో బీజేపీ వాళ్లు గాడ్సే విధానాలను అనుసరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నోరు విప్పట్లేదు. 

దీన్నిబట్టే వారు ఎలాంటి కుట్ర చేస్తున్నరో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని అన్నారు.  జమ్మూకాశ్మీర్​, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఓడిపోతాయన్న భయంతోనే  రాహుల్​పై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని.. ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్​ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,  ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి,  కేఆర్  నాగరాజు, రేవూరి ప్రకాశ్​రెడ్డి, గండ్ర సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు,  మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, పార్టీ వరంగల్​ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.   

బీజేపీవి దిగజారుడు రాజకీయాలు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అగ్రనేత రాహుల్ గాంధీ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మతాల పేరిట ఓట్లు చీల్చి మోదీ ప్రధాని అయ్యారు. బీజేపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి100 సీట్లు కూడా రావు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. దీంతో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ  గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది” అని మండిపడ్డారు.