పీసీసీ చీఫ్ కు అంజన్​కుమార్​ యాదవ్ ​సన్మానం

పీసీసీ చీఫ్ కు అంజన్​కుమార్​ యాదవ్ ​సన్మానం

బషీర్ బాగ్, వెలుగు : పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్​ను మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్ గురువారం ఆదర్శ్​నగర్​ఓల్డ్​ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పునాదులు కార్యకర్తలేనన్నారు. పార్టీ కోసం కష్టపడి పడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. మూసీ కూల్చివేతలపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని, మూసీపై కట్టిన ఇండ్లను మాత్రమే తొలిగిస్తున్నామని చెప్పారు. 

పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ప్రస్తుతం నీట మునిగిపోతున్నాయంటే కారణం ఏమిటో ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని క్యాడర్​కు పిలుపునిచ్చారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి అభినందనలు అంజన్​కుమార్​నుంచే అందాయని తెలిపారు. తమ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా సమయం వచ్చినప్పుడు అందరం ఒక్కటవుతామని చెప్పారు.  

ఎంపీ అనిల్​కుమార్​యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఫహీం ఖురేషి పాల్గొన్నారు. అలాగే జూనియర్​లెక్చరర్స్​పరీక్షా ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదర్ గూడ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రం ఇచ్చారు.