
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక శకటాన్ని పీసీసీ రూపొందించింది. దాన్ని శనివారం కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ దీప్ దాస్ మున్షీ గాంధీ భవన్ లో ప్రారంభించారు. గతంలో సోనియా గాంధీని కేసీఆర్ పొగిడిన మాటలను ఈ శకటంలో ఏర్పాటు చేశారు. “సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ రాష్ర్టం సాకారమైంది.
ఈ అంశంలో ఎవరికి డౌటే అవసరం లేదు.” అని తొలి అసెంబ్లీ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ మాటలను శకటం ద్వారా ప్రజలకు వినిపించేలా అందులో మైక్ లను సెట్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఫిషర్మెన్ సెల్ నేత మెట్టు సాయికుమార్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.