
సీఎం కేసీఆర్ అసమర్ధత కారణంగా కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రాకే వెళుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంగమేశ్వర్ దగ్గర రోజుకు 3 టీఎంసీ నీళ్లను ఏపీ ప్రభుత్వం తీసుకుపోతుంటే కేసీఆర్ మౌనం వహించడం పలు అనుమానాల ను కలిగిస్తుందన్నారు. పోతిరెడ్డిపాడును అడ్డుకోకుండా కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్ లు కలిసినప్పుడు నీటి సమస్యల పై- తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం పై కేసీఆర్ మాట్లాడకపోవడం కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోందన్నారు.
కేవలం రెండు టీఎంసీ ల సామర్ధ్యం గల కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 1లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. పోతిరెడ్డిపాడు నుంచి 6 టీఎంసీ నీళ్లను తెలంగాణ నష్టపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? అని అన్నారు. తుగ్లక్ గురించి హిస్టరీ లో చదివాను…కానీ ఇప్పుడు స్వయంగా కేసీఆర్ అనే తుగ్లక్ అని చూస్తున్నానని ఉత్తమ్ విమర్శించారు.
పోతిరెడ్డి పాడు నుంచి 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోతాం అని ఏపీ అధికారికంగా ప్రకటన చేసిందన్నారు. పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో రిలీజ్ చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే నాగార్జున సాగర్- పాలమూరు ఎత్తిపోతల-కల్వకుర్తి కి చుక్క నీరు ఉండవన్నారు. తెలంగాణ నీళ్లు ఏపీ బహిరంగంగా తీసుకుపోతుంటే కేసీఆర్ అడ్డుకోరా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కి11న టెండర్లు పిలుస్తున్నందున, టెండర్లు పూర్తి కావాలనే కేసీఆర్ అపెక్స్ భేటీ వాయిదా వెయ్యమంటున్నాడని ఉత్తమ్ అన్నారు. పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్ట్ పూర్తి అయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని, పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.