
హైదరాబాద్, వెలుగు: హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తారని, పోలీసులను కొట్టినట్లు నటిస్తారని, కానీ తాను నిజ జీవితంలో ఇవన్నీ చేశానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా బంజారాహిల్స్ లోని నందినగర్లో ఆయన తన మూవీ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాలో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. రాజకీయాల్లో నాది సక్సెస్ఫుల్ ప్రయాణం. సినిమాలోనూ అలాగే ఉంటుంది.
విద్యార్థి నేతగా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా నేను ఎదురుకొన్న కష్టాలు, బాధలు చూపించారు. నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నా” అని జగ్గారెడ్డి అన్నారు. ‘‘ఒక కథ రాసుకున్నాను. అందులో మీ పాత్ర ఉండాలనుకుంటున్నానని డైరెక్టర్ రామానుజం చెప్పారు. ఆ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో సినిమాకు ఒప్పుకున్నా. ఆయన చూపించిన నా పోస్టర్ నన్ను అట్రాక్ట్ చేసింది. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని జగ్గారెడ్డి వివరించారు.