అధికారం పోయేసరికి కేటీఆర్, హరీశ్​కు మెంటలెక్కింది : జగ్గారెడ్డి

అధికారం పోయేసరికి  కేటీఆర్, హరీశ్​కు మెంటలెక్కింది : జగ్గారెడ్డి
  • రేవంత్​ తొడగొడితే కేటీఆర్ వణకాల్సిందే: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయేసరికి కేటీఆర్, హరీశ్​రావుకు పిచ్చి పట్టిందని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​జగ్గారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్  మీడియా, సోషల్ మీడియా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. సీఎం రేవంత్​రెడ్డిని కేటీఆర్​ ‘చిట్టినాయుడు’ అంటూ కించపరిచేలా మాట్లాడుతున్నాడని, రేవంత్​ చిట్టినాయుడు కాదు.. గట్టినాయుడు.. గట్టిరెడ్డి అని తెలిపారు. రేవంత్​ తొడగొడితే కేటీఆర్​ వణకాల్సిందేనన్నారు.

 శనివారం గాంధీ భవన్​లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.  సీఎం రేవంత్ పై, తనపై ఇంకోసారి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వాళ్ల అంతు చూస్తానని హెచ్చరించారు. . తాను అనని మాటలను అన్నట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం వద్ద బట్టలు విప్పి, ఉరికించి కొడ్తానని వార్నింగ్​ ఇచ్చారు.

కేటీఆర్ ​డీపీతో దుబాయ్​ నుంచి పోస్ట్​లు

డీపీలో కేటీఆర్ ఫొటో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్​ ద్వారా దుబాయ్ నుంచి పోస్టులు పెట్టిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో  అధికారులు, పోలీసులను కేటీఆర్, హరీశ్​రావు తిట్టిన వీడియో క్లిప్ లను మీడియాకు చూపించారు.  రాజకీయంగా తనను అప్రతిష్టపాలు చేసేలా పలు న్యూస్ చానల్స్,  సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం  చేస్తున్నారని, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు.  

రెండేండ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ పై బహిరంగ సభలోనే ఆగ్రహం వ్యక్తం చేశానని, ఆ మాటలను ఇప్పుడున్న మహిళా కలెక్టర్ కు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.