కామేపల్లిలో గర్ల్స్ ​హాస్టల్ ఏర్పాటు చేయాలి

కామేపల్లిలో గర్ల్స్ ​హాస్టల్ ఏర్పాటు చేయాలి
  •     తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట పీడీఎస్​యూ ధర్నా 

కామేపల్లి. వెలుగు : కామేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్​ పోస్టుమెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం కళాశాల నుంచి తహసీల్దార్  ఆఫీస్ వరకు పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ సుధాకర్ కు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి జి.మస్తాన్ మాట్లాడుతూ కామేపల్లిలో బాలికలకు హాస్టల్ లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్​ కాలేజీ ఉన్నప్పటికీ గర్ల్స్​ అడ్మిషన్స్​ ఎక్కువగా జరగడం లేదని తెలిపారు. వెంటనే కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు.

పెండింగ్ ​స్కాలర్​షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గాంధీ, వెంకటేశ్, నరసింహ, రవికుమార్, చందు, విద్యార్థులు పాల్గొన్నారు.