
శంషాబాద్, వెలుగు: ఢిల్లీ నుంచి శుక్రవారం శంషాబా ద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మాల మహానాడు నేతలు ఘనస్వాగతం పలికారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి వంశీకృష్ణకు శాలువా కప్పి బొకే అందించారు. అనంతరం డప్పు సప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో వెహికల్ వరకు తీసుకొచ్చారు.
తర్వాత వంశీకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ నేతలు, కార్యకర్తల అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కాకా వెంకటస్వామి అభిమానులతో పాటు చెన్నూర్, మందమర్రి, మంచిర్యాల నుంచి తన కోసం పెద్దసంఖ్యలో తరలివచ్చిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. కాకా ఆశయాలను నెరవేరుస్తానని, పెద్దపల్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ.. అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్తో పాటు చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, అటవీ అధికారులతో రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు.