
తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు విషప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అడ్డుకోవాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి (మార్చి23) జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ చేపట్టని విధంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని.. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమన్నారు. ఎన్నో తరాలుగా ఎదురుచూస్తున్న కులగణన విషయంలో చట్టం తీసుకొచ్చి వర్గీకరణ ప్రారంభించిందన్నారు.
కొంతమంది కాంగ్రెస్ పథకాల ద్వారా లబ్ది పొందుతూ రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అలాంటి వారి పేర్లను బయట పెడతామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం... రాజ్యాంగాన్ని పక్కనపెట్టి... ఎలాంటి సిద్దాంతం లేకుండా తెలంగాణ ప్రాథమిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జై భీమ్, జై సమ్మిదాన్, జై బాపు అనే కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గడపగడపకు తీసుకుపోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే బాధ్యత కార్యకర్తలు నాయకులపైనే ఉందని దిశానిర్దేశం చేశారు.