
తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహించే బోనాల జాతరలో వేలాది మంది భక్తులు బోనాలతో పెద్దపూర్ వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లికార్జున స్వామిని స్థానికులతో పాటు చుట్టూ పక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల భక్తులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మల్లన్నకు ఇష్టమైన ఆదివారం రోజున గత 29 ఏండ్లుగా గ్రామస్థులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం ముట్టుకోకుండా నియమ నిష్టలతో ఉంటారు. ఆదివారం ( మార్చి 16 ) మల్లన్న ఆలయంలో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. పట్నాలు వేసి, మల్లికార్జునుడికి ఇష్టమైన బోనాలను భక్తులు నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉపవాస దీక్షలతో భక్తులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం, వందల సంఖ్యలో గొర్రె పిల్లలను మల్లన్నకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ALSO READ | అలర్ట్.. మరో నాలుగు రోజులు అవసరమైతేనే బయటకు రండి
అలాగే ఇష్టమైన గూడాన్నం, పరమాన్నం బోనాలు తీసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పు మోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. నైవేద్యం వండి స్వామి వారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. సాయంత్రం ఒకేసారి సుమారు 50 వేలకు పైగా బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల శోభాయాత్ర అనంతరం రథోత్సవం జరిపారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.