
- ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ హాజరు
పెద్దపల్లి, వెలుగు: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోదరులకు సోమవారం సాయంత్రం పెద్దపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ లీడర్లు, ముస్లిం మైనార్టీ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణకు సన్మానం
కరీంనగర్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్ద పల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను కరీంనగర్లో దళిత కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణను ప్రకటించినందుకు హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు లీడర్లు మాట్లాడుతూ వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.
కార్యక్రమంలో లీడర్లు వెన్న రాజమల్లయ్య, నాత శ్రీనివాస్, విక్టర్, కాడే సూర్యనారాయణ, కాడే శంకర్, రాజ్ కుమార్, రవీందర్, కనకయ్య , ఆంజనేయులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పొనుగోటి నవీన్రావును ఆయన నివాసంలో వివేక్, వంశీకృష్ణ పరామర్శించారు. నవీన్రావు తల్లి విమలాదేవి ఇటీవల మరణించారు.