
వెల్దుర్తి, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు పెన్షన్ బుక్ మీద ఫొటో మార్చి ఓ వృద్ధురాలి పెన్షన్ డబ్బులు కాజేశారు. బాధితురాలి కథనం మేరకు.. మెదక్ జిల్లా మాసాయిపేటకు చెందిన శేషు పెంటమ్మ అనారోగ్యంతో కొన్ని నెలలుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు పెన్షన్ బుక్కుపై ఫొటో మార్చి ప్రతి నెలా బ్యాంక్ నుంచి పెన్షన్ డబ్బులు తీసుకెళ్లారు. ఈ నెల పెన్షన్ కోసం ఆమె బుధవారం బ్యాంక్ కు రాగా, ఈ విషయం బయటపడింది. దీంతో ఆమె బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపింది.
బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ నవీన్ రెడ్డిని సంప్రదించగా, బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.