త్వరలో ఎలక్ట్రిక్​ ఆటోలకు పర్మిట్లు!

త్వరలో ఎలక్ట్రిక్​ ఆటోలకు పర్మిట్లు!
  • ఈవీ పాలసీ ఉన్నా కొత్త ఆటోలకు నో పర్మిషన్​
  • పాత ఆటోను స్ర్కాప్​ చేస్తేనే అనుమతి
  • మంత్రి పొన్నం హామీతో ఆటో డ్రైవర్లలో ఆనందం

 హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​పరిధిలో త్వరలో ఎలక్ట్రిక్​ఆటోలకు పర్మిట్లు ఇవ్వనున్నారు. నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో 2002లో ఆటోలకు అనుమతిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వమే కొన్ని వాహనాలకు అనుమతులివ్వగా, మరికొందరు ఇతర జిల్లాల నుంచి ఆటోలను తీసుకువచ్చి నగరంలో నడుపుకుంటున్నారు.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్​వెహికల్(ఈవీ) పాలసీని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్​వాహనాలు కొనేవారికి రెండేండ్ల పాటు ట్యాక్స్, రిజిస్ట్రేషన్​లో రాయితీని ప్రకటించింది. దీంతో అధిక సంఖ్యలో టూ వీలర్లు, కార్లు, ఇతర వాహనాలు కొంటున్నారు. ఆటోల విషయానికి వచ్చేసరికి సర్కారు నిబంధనలు ఎలక్ట్రిక్​ఆటోల కొనుగోలుకు అడ్డంకిగా మారాయి. సిటీలో కొత్త ఆటో కొనాలంటే ఎక్స్​పైరీ అయిన ఆటోను స్క్రాప్​చేయాలంటున్న ఆఫీసర్లు.. ఎటువంటి రూల్స్​లేకుండా ఎలక్ట్రిక్​ఆటోలు కొనడానికి పర్మిట్లు ఇవ్వడం లేదు. 

మంత్రిని కలిసిన ఆటో సంఘాల లీడర్లు  

ఎలక్ట్రిక్​ఆటోలకు అనుమతి ఇవ్వాలంటూ ఆటోల సంఘాల లీడర్లు మూడు రోజుల కింద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిశారు. ఇతర జిల్లాల నుంచి నగరంలోకి వస్తున్న ఆటోలను అనుమతిస్తున్న ఆర్టీఏ అధికారులు ఎలక్ట్రిక్​ఆటోలు కొనేందుకు మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు.

దీంతో త్వరలోనే ఎలక్ట్రిక్​ఆటోలకు పర్మిట్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై ఆర్టీఏ ఉన్నతాధికారులను సంప్రదించగా, మంత్రి ఆదేశాల మేరకు ఎలక్ట్రిక్​ఆటోలకు పర్మిట్లు జారీ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆటో సంఘాల లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.