
ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు చిలప్ చెడ్ మండలంలో రహీం గూడ తండాకు చెందిన ముకేష్, మురారి, నునావత్ మోహన్ ఇండ్లపై రేకులు , సోమక్కపేట్ చౌరస్తా వద్ద జావీద్ హుస్సేన్ చికెన్ సెంటర్ రేకులు ఎగిరి పోయాయి. చిలప్ చెడ్ లో 33 కే వీ కరెంటు పోల్స్ విరిగిపోయాయి. గుజిరి తండాలో పిడుగుపడి రమావత్ చంద్రియాకు చెందిన దాదాపు వంద గడ్డిమోపులు కాలిపోయాయి. కంగ్టి మండలంలో పలు దుకాణాలు, ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. బోర్గి గ్రామంలో ఓ ఇంట్లో సామాన్లు చెల్ల చెదురయ్యాయి. పలు గ్రామాల్లో స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్కు అంతరాయం కలిగింది.
- మెదక్ (చిలప్ చెడ్), కంగ్టి, వెలుగు