పవన్ కల్యాణ్​పై సివిల్ దావా .. సిటీ సివిల్ కోర్టులో దాఖలు ​చేసిన అడ్వకేట్​

పవన్ కల్యాణ్​పై సివిల్ దావా .. సిటీ సివిల్ కోర్టులో దాఖలు ​చేసిన అడ్వకేట్​
  • ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూపై కామెంట్లు​చేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్​పై హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  సిటీ సివిల్  కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు గాయపడేలా పవన్  నిరాధార ఆరోపణలు చేశారని అడ్వొకేట్  ఇమ్మనేని రామారావు ఈ కేసు వేశారు. పవన్  చేసిన వ్యాఖ్యలు ఇంకా ఇంటర్ నెట్‌‌‌‌‌‌‌‌లో సర్క్యులేట్​ అవుతున్నాయని, ఆ వీడియోలను తొలగించాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్​ కల్యాణ్​చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఎనిమిది యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ లింక్స్‌‌‌‌‌‌‌‌ ను కోర్టుకు అందించారు.

 లడ్డూ విషయంలో ల్యాబ్​ రిపోర్టు​రాకముందే అందులో ఏవేవో కలిశాయని పవన్​​బహిరంగంగా వ్యాఖ్యానించారని, బాధ్యతగల పదవిలో ఉండి శాస్త్రీయతమైన ఆధారాలు లేకుండా ఆయన కామెంట్లు​చేశారని రామారావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఐటీ యాక్ట్​ 69 ప్రకారం ఇంటర్ నెట్ లో ఉన్న ఆ వీడియోలు తొలగించేలా బాధ్యులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తిరుపతి ప్రసాదంపై పవన్  కల్యాణ్​ మరోసారి ఇలాంటి వాఖ్యలు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై మంగళవారం విచారణ జరగనుంది.