అసెంబ్లీలో ఫొటోల కిరికిరి.. హరీశ్ రావుపై స్పీకర్కు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు

అసెంబ్లీలో ఫొటోల కిరికిరి..  హరీశ్ రావుపై స్పీకర్కు ఆది శ్రీనివాస్  ఫిర్యాదు

= గత బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డ సిర్పూర్ ఎమ్మెల్యే
= కాళేశ్వరం ఉసురు తగిలిందంటూ వ్యాఖ్యలు
= ఎమ్మెల్యే హరీశ్ బాబు అభినందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
= ఆ సమయంలో ఫొటోలు తీసిన మాజీ మంత్రి హరీశ్ రావు
= మాజీ మంత్రి రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ స్పీకర్ కు ఆది శ్రీనివాస్ కంప్లయింట్

 హైదరాబాద్: అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా బీజేపీకి  చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు నిన్న రాత్రి గత బీఆర్ఎస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నిర్మానంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ ప్రభుత్వానికి ఆదిలాబాద్, సిర్పూర్ ప్రజల ఉసురు తగిలిందని అన్నారు.  ఆయన ప్రసంగం పూర్తవగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి హరీశ్ బాబును అభినందించారు. పలువురు ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. 

ఈ సమయంలో సభలోనే ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు వారి ఫొటోలను తన సెల్ ఫోన్ లో బంధించారు. ఇదే సమయంలో సభలో స్పీకర్ ,  హరీశ్ రావు ను ఉద్దేశించి ‘మీరు మంత్రి గా పని చేశారు. ఫొటో లు తీయడం కరెక్ట్ కాదు’ అన్నారు. దీనిపై ఇవాళ  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కు స్పీకర్​ పై గౌరవం లేదని  ఆరోపించారు. సీఎం రేవంత్​ అంటే ఈర్ష్య, డిప్యూటీ సీఎంపై నిందారోణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకత్వం శాసనసభ సంప్రదాయాలను పక్కనబెట్టి ఫొటోలు, వీడియోలు తీసిందని తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో స్పీకర్ అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు చేయవద్దని శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన హరీశ్​ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. లాబీల్లో నినాదాలు చేయడం, ఎంట్రీ పాయింట్​ వద్ద ధర్నా చేయడాన్ని కూడా ఆది తప్పుబట్టారు.  హరీశ్ రావుతోపాటు ఇతర సభ్యులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.