
లక్నో:‘‘మహా కుంభమేళాలో రాబందులకు మృతదేహాలు, పందులకు అశుద్ధం దొరుకుతుండొచ్చు కానీ సున్నిత మనస్కులకు మాత్రం అందమైన అనుబంధాల సజీవ చిత్రాలు కనిపిస్తున్నాయి. వర్తకులకు బిజినెస్ జరుగుతోంది. భక్తులకు అక్కడి పరిశుభ్రమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి’’ అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా విమర్శకులపై విరుచుకుపడ్డారు.
సోమవారం యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు సీఎం యోగి ఘాటుగా జవాబిచ్చారు. ఒక ప్రత్యేకమైన కులానికి సంబంధించిన వారిని కుంభమేళాకు అనుమతించడంలేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. పవిత్రమైన మనస్సుతో, నమ్మకంతో కుంభమేళాకు ఎవరైనా వెళ్లొచ్చని స్పష్టం చేశారు. అయితే, చెడు ఉద్దేశంతో వెళ్లి అక్కడ ఏదైనా గలాటా సృష్టించాలని చూస్తే తప్పకుండా అక్కడే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.
కుంభమేళాలో ఏర్పాట్లను తానే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని, కోట్లాదిగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయిస్తున్నామని సీఎం యోగి వివరించారు.