
రూర్కీ:ఉత్తరాఖండ్లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మధ్య ఏర్పడిన విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకరి ఆఫీస్పై మరొకరు కాల్పులు జరుపుకున్నారు. రాళ్లు విసురుకున్నారు.
అనుచరులతో వెళ్లి వీరంగం సృష్టించారు. ఆపై ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇద్దరిపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్.. ఖాన్పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ మధ్య మొదట్నుంచి తీవ్ర విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఛాంపియన్ తన అనుచరులతో వెళ్లి కుమార్ ఆఫీస్పై రాళ్లు విసిరారు.
అక్కడున్న కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారు. ఆఫీస్ బిల్డింగ్పైకి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత ఖాన్ పూర్ ఎమ్మెల్యే కుమార్ కూడా వెళ్లి ఛాంపియన్ ఆఫీస్పై కాల్పులు జరిపారు.