
మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారాలకు ఇంకా 13 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ఉదృతం చేస్తున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గ్రామాల్లో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమకున్న ప్రజాబలాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
కాంగ్రెస్ సభలు
కాంగ్రెస్ కొద్ది రోజుల కిందట మెదక్పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రచార సభలకు ధీటుగా కాంగ్రెస్ ప్రచార బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. నాలుగైదు రోజుల్లో నర్సాపూర్ లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత మెదక్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా జిల్లాలోని మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్లలో బీజేపీ అగ్రనేతల మీటింగ్లకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.
రెండు చోట్ల ముఖ్యమంత్రి సభలు
అధికార బీఆర్ఎస్ మెదక్, నర్సాపూర్ రెండు చోట్ల పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఈనెల 15న మెదక్ పట్టణంలో, 16న నర్సాపూర్ పట్టణంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తరువాత ఐదారు రోజుల్లో మెదక్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ప్లాన్ చేస్తున్నారు.