
- అలాంటి రూల్ లేదన్న తహసీల్దార్
- ఆందోళనతో రెండు గంటల పాటు నిలిచిపోయిన గ్రామసభ
- ఎట్టకేలకు ప్రధానమంత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆఫీసర్లు
- మెదక్ జిల్లా వెల్మకన్నలో ఘటన
కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించగా.. ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి ఫొటో లేదని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసర్లకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. గ్రామసభ నిర్వహించేందుకు ఉదయం తహసీల్దార్ ఆంజనేయులు, ఇతర సిబ్బంది గ్రామానికి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ బీజేపీ జిల్లా లీడర్రాజేందర్, పార్టీ మండల అధ్యక్షుడు రాకేశ్ ప్రశ్నించారు. దీనికి ఆఫీసర్లు అలాంటి రూల్స్ఏవీ లేవని చెప్పారు. దీంతో బీజేపీ లీడర్లు కచ్చితంగా ఫ్లెక్సీలో మోడీ ఫొటో ఉంటేనే గ్రామసభ నిర్వహించాలని లేదంటే బహిష్కరిస్తామన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆంజనేయులుకు, బీజేపీ నాయకులకు గొడవ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు గ్రామసభ నిలిచిపోగా విషయం తెలుసుకున్న నర్సాపూర్ సీఐ షేక్లాల్మదర్, చిలప్చెడ్ ఎస్ఐ రమేశ్ పోలీస్ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. చివరకు ప్రజాపాలన ఫ్లెక్సీలో మోడీ ఫొటో ఏర్పాటు చేయడంతో గ్రామసభ ప్రారంభమైంది.