
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిన్ అకాడమీని జనవరి 16వ తేదీ మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు.
దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. దేశంలో పేదరికాన్ని తరమి కొట్టడమే మా లక్ష్యమని చెప్పారు. అందుకోసం గత పదేళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాన్నారు. తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని... పేదరికాన్ని రూపుమాపే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని.. GSTతో పన్నులను సరళతరం చేశామని తెలిపారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతోందని... రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయని చెప్పారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని.. దేశంలో వారికి కోసం అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నాన్నారు. ఎన్నో పెండింగ్లో పనులను పూర్తి చేశామని ఆయన చెప్పారు.
రామరాజ్యంలో ఏ విధంగా ప్రజలకు సుపరిపాలన అందిందో ఆ విధమైన పాలన అందించాలని మహాత్మ గాంధీజీ అనేక సార్లు ప్రస్తావించారని మోదీ చెప్పారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్టతో దేశమంతా రామమయం అయ్యిందని ప్రధాని అన్నారు.
నాసిన్ కేంద్రాన్ని దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో 1500 కోట్ల రూపాయలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మించారు. IRSకు ఎంపికైన అభ్యర్థుల నాసిన్ లో శిక్షణ ఇవ్వనున్నారు.